న్యూఢిల్లీ: తజకిస్థాన్లో వచ్చేవారం జరిగే షాంఘై సహకార సంఘం (SCO) సమావేశంలో భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ పాల్గొననున్నారు. ఇతర దేశాల జాతీయ భద్రతా సలహాదారులు కూడా జూన్ 23, 24 తేదీల్లో జరిగే సమావేశాల్లో వ్యక్తిగతంగా హాజరవుతారు. కొవిడ్-19 నిబంధనల మేరకు ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ సదస్సులో పాకిస్థాన్ NSA మొయీద్ యూసఫ్ కూడా పాల్గొంటారు.
అయితే, ఈ సదస్సు సందర్బంగా భారత్, పాకిస్థాన్ ఎన్ఎస్ఏలు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారా లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని భారత్, పాక్ సైన్యాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో అంగీకారానికి వచ్చాయి. దీంతో నియంత్రణ రేఖ వెంబడి జమ్ము-కశ్మీర్లో కాల్పులకు తెరపడింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల ఎన్ఎస్ఏలు సమావేశమవుతారా? అనే విషయంలో ఆసక్తి నెలకొంది.
అయితే, మార్చి, ఏప్రిల్ నెలల్లో భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఎస్ఎం ఖురేషీ ఒకే చోట కలిసిన సందర్భాలు వచ్చాయి. కానీ వారిద్దరూ కలిసి చర్చలు జరపలేదు. మార్చిలో తజకిస్థాన్లోని దుషాంబేలో ‘హార్ట్ ఆఫ్ ఆసియా’ మీట్లో, ఏప్రిల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారు. కానీ వారి మధ్య ద్వైపాక్షిక భేటీ జరుగలేదు. షాంఘై సహకార సంఘంలో భారత్, రష్యా, చైనా, పాకిస్థాన్, కజకిస్థాన్, కిర్గిజ్స్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్ ఉన్నాయి.