యాచారం : మండలంలోని మేడిపల్లి గ్రామంలో పోచమ్మ బోనాల ఉత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు, ఆడపడుచులు బోనమెత్తి ఊరేగింపు నిర్వహించారు. బోనాల ఊరేగింపులో డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాల నడుమ శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, యువకులు, పిల్లల కేరింతలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బోనాల సందర్భంగా గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. పోచమ్మ అమ్మవారికి భక్తి శ్రద్దలతో భక్తులు, ప్రజాప్రతినిధులు పూజలు నిర్వహించి దీప,దూప నైవేద్యాలు సమర్పించారు. కోరిన కోర్కెలు తీర్చాలని అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.