హైదరాబాద్, మార్చి 25: రాష్ట్రంలోకి పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. ఇప్పటికే దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. తాజాగా సౌమెనీ హోమ్ ఇన్నోవేషన్ లిమిటెడ్ (ఎస్హెచ్ఐఎల్) అనుబంధ సంస్థ హింటాస్టిక ప్రైవేట్ తెలంగాణలో వాటర్ హీటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. రూ.150 కోట్ల పెట్టుబడితో జడ్చర్లలో ఏర్పాటు చేయబోతున్న ఈ యూనిట్ వచ్చే ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా పథకంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్తో ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 5.7 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ మార్చి 2022 నాటికి పూర్తవుతుందని పేర్కొన్న సంస్థ.. వచ్చే ఏడాది మేలో ట్రయల్ రన్ ప్రారంభించనున్నది. జాయింట్ వెంచర్లో ఏర్పాటవుతున్న ఈ యూనిట్లో ఫ్రాన్స్కు చెందిన గ్రూపు అట్లాంటిక్ 50 శాతం వాటా కింద రూ.68.30 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్లు గురువారం ప్రకటించింది. భారత్లో వాటర్ హీటర్లకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఈ యూనిట్ను నెలకొల్పినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
వచ్చే మూడు నుంచి నాలుగేండ్లకాలంలో రూ.300 కోట్ల ఆదాయాన్ని ఈ జాయింట్ వెంచర్ లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రతియేటా ఈ ప్లాంట్లో 6 లక్షల పరికరాలు ఉత్పత్తి కానున్నాయి.
ప్రతియేటా భారత్లో 36 లక్షల వాటర్ హీటర్లు అమ్ముడవుతున్నాయి. వీటిలో ఎస్హెచ్ఐఎల్కు 7.3 శాతం వాటా ఉన్నది. ప్రతియేటా ఈ రంగం 10 శాతం వృద్ధిని సాధిస్తున్నది.
ఏకో-ఫ్రెండ్లీ హీటింగ్, హాట్ వాటర్ సొల్యూషన్స్ విభాగంలో 50 ఏండ్లకు పైగా అనుభవం ఉన్న గ్రూపు అట్లాంటిక్కు ప్రపంచవ్యాప్తంగా 28 యూనిట్లు ఉన్నాయి. వీటిలో 10 వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.