వాస్తు, శిల్పరీతులు వేర్వేరు రాజ్యాల్లో, వేర్వేరు రాజవంశాల పోషణలో కొత్త అందాలను సంతరించుకుంటూ, మానవ సృజనాత్మకతకు అద్దం పడుతున్నాయి. ఇక్ష్వాకుల కాలంలో మొదలైన వైదిక ఆలయ నిర్మాణం, విష్ణుకుండి, బాదామి చాళుక్య, రాష్ట్రకూట కాలాలను దాటుకొని కళ్యాణి చాళుక్యకాలం నాటికి పరిణతి చెందింది. బాదామి చాళుక్య కాలంలో మొదలైన వేసరశైలి కళ్యాణి చాళుక్య కాలానికి మరిన్ని సొబగులనద్దుకుంది. ఉదాహరణకు ఉత్తర భారతదేశపు భూమిజ శైలిలోని అలంకరణలు, చిన్న శిఖరాల వంటి అంశాలను తనలో చేర్చుకున్నది.
కళ్యాణి చాళుక్య శైలికి ప్రతీక కర్ణాటకలోని లక్కుండి అనే ఊళ్ళో ఉన్న ఆలయాలు. బాదామి చాళుక్య శైలికి ఐహోళే, పట్టడకల్ నిర్మాణాల లాగా కళ్యాణి చాళుక్యులకు లక్కుండి వాస్తు రీతి ప్రామాణికం. చాళుక్య చక్రవర్తి సోమేశ్వర రాసిన ‘మానసోల్లాసం’లో వర్ణించిన సంగీత, నృత్య అంశాలను కళ్యాణి చాళుక్య వాస్తు రీతిలో కట్టిన ఆలయాల్లో శిల్పాలపై మలిచారు. ఈ కాలపు వైదిక ఆలయాలు, జైన నిర్మాణాలు కర్ణాటక, తెలంగాణలలో ఎన్నో కనిపిస్తాయి. ఇప్పటికీ తెలంగాణ గ్రామాల్లో ఎన్నో గుళ్లు కళ్యాణి చాళుక్యకాలంలో మొదలై కాకతీయుల కాలం, ఆ తర్వాత కూడా కొనసాగుతూ వారసత్వ సంపదగా మన ముందున్నాయి.
నందికంది రామలింగేశ్వరాలయం: హైదరాబాద్కు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ముంబయి హైవేపై సంగారెడ్డి జిల్లా నందికంది గ్రామంలోని రామేశ్వర లేక రామలింగేశ్వర ఆలయం కళ్యాణి చాళుక్య వాస్తు రీతికి గొప్ప ఉదాహరణ. నక్షత్రం ఆకారంలో ఉన్న ఈ గుడి ముందున్న ఒక స్తంభంపై క్రీ.శ.1014 నాటి కన్నడ శాసనం కళ్యాణి చాళుక్యరాజు ఐదవ విక్రమాదిత్యుడి కాలం నాటిది. కిరియానందిలోని నామేశ్వర దేవుడికి కోవూరు గ్రామాన్ని పంప పెర్మానడి అనే మహామండలేశ్వరుడి అనుమతితో వక్ఖాణి దేవర (వ్యాఖ్యాన దేవర) కాలు కడిగి దానం చేసిన విషయానికి సాక్షి ఈ శాసనం. 50 మంది సాధువులకు, విద్యార్థులకు భోజనం నిమిత్తం ఈ దానం చేసినట్టు చెపుతుంది. కిరియానంది నందికందికి పూర్వ నామం, నామేశ్వరుడు నేటి రామేశ్వరుడు కావచ్చు. ఇంతేగాక ఈ గుడి దీప స్తంభంపై ఆహవమల్ల (మొదటి సోమేశ్వర) శాసనం, మదివోజనకెరె అనే చెరువు గురించిన ప్రస్తావన ఉన్న ఆరవ విక్రమాదిత్యుడి క్రీ.శ.1014 శాసనం నందికందిలో చాళుక్య యుగానికి ఆధారాలు.
తెలంగాణలో అద్భుత వాస్తు, శిల్పరీతులకు మోడల్స్గా ప్రదర్శించుకోవాల్సిన గుళ్ళలో నందికంది ఒకటి. 16 కోణాలతో నక్షత్ర ఆకారంలో రెండంతస్తుల విమానం, దానిపై తామర రేకుల ఆకారంలో అమర్చిన రాళ్లు, దానిపై కలశం, ఇప్పటికీ అందంగా నిలిచి ఉన్నాయి. గుడి ముందున్న మకర తోరణం, మందిరంలోని బ్రహ్మ, విష్ణు- నరసింహ, విష్ణు- వరాహ, విష్ణు, గరుడ, నటరాజ, శివ, మహిషాసురమర్ధని, సరస్వతి, నృత్య- గణపతి శిల్పాలను చాళుక్య రీతిలో మలిచారు.
తెలంగాణలో దేవాలయాల గురించి ప్రొఫెసర్ ముక్కామల రాధాకృష్ణ శర్మ పుస్తకం టెంపుల్స్ ఆఫ్ తెలంగాణ ఇప్పటికీ ప్రామాణిక గ్రంథమే. ఓయూలో చరిత్ర, ఆర్కియాలజీ శాఖను నిలిపిన రాధాకృష్ణశర్మ ఈ పుస్తకంలో తెలంగాణలోని చాళుక్య, కాకతీయ దేవాలయాల చరిత్రను, నిర్మాణ శైలిని, శిల్పరీతులను విపులంగా చర్చించారు.
ప్రొఫెసర్ ,ముక్కామల
రాధాకృష్ణ శర్మ
నందికందికి 35 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న పటాన్చెర్వులో కూడా కళ్యాణి చాళుక్యకాలం నాటి జైన ఆలయాలు, శిల్పాలనే కాదు, హిందూ ఆలయాల శిథిలాలను కూడా ఆర్కియాలజీ శాఖ రికార్డు చేసింది. ఇదే జిల్లా అల్లాదుర్గంలో త్రైలోక్యమల్ల (మొదటి సోమేశ్వర) కాలపు శాసనాలు, శైవ, జైన గుళ్లు ఇప్పటికీ ఉన్నాయి. బిచ్కుందలోని నగరేశ్వరాలయం కళ్యాణి చాళుక్య కాలంలో మొదలై కాకతీయుల కాలంలో మార్పులకు గురైనట్టు తెలుస్తున్నది. ఇక బోధన్లోని ఇంద్ర నారాయణ దేవాలయం (ఇప్పటి దేవల్ మసీదు) రాష్ట్ర కూట, కళ్యాణి చాళుక్యకాలాల్లో విలసిల్లిన జైన, శైవ నిర్మాణం.
జడ్చెర్ల దగ్గరి గంగాపురంలో ఉన్న శిథిల శైవ ఆలయాలు కూడా కళ్యాణి చాళుక్య కాలానివే. మొదటి సోమేశ్వరుడితో సహా కొందరు రాజుల శాసనాలు ఇక్కడున్నాయి. కొల్లాపూర్ మండలం సోమశిలలో, మల్లేశ్వరంలో, జటప్రోలు, దాని దగ్గరే బెక్కెంలో కళ్యాణి చాళుక్య ఆలయాలున్నాయి.
ధర్మపురి కథ: ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన ఈ మందిర ప్రాచీనతపై అనేక చర్చలున్నాయి. అయితే వేములవాడ చాళుక్యుల కాలంలోనే ధర్మపురి అగ్రహారాన్ని రెండవ అరికేసరి దానం చేసిన ఆధారం కురిక్యాల శాసనాల్లో ఉంది. అయితే ఇప్పటి గుడిలోని ఒక స్థంభంపై ఉన్న కాకతీయ గణపతి దేవుడి శాసనం కింద కలయని చాళుక్య ఆరవ విక్రమాదిత్యుడి శాసనం ఉందని ఆర్కియాలజీ శాఖకు చెందిన సంగనభట్ల నరహరి రాశారు. అంటే ఆధారాలను బట్టి ధర్మపురి ఆలయం కళ్యాణి చాళుక్య కాలం నుంచి ఉందని చెప్పుకోవచ్చు.
కందూరు చోడుల పానుగల్లు గుళ్ళు: కందూరు చోడులు, కాకతీయులు ఇద్దరూ కళ్యాణి చాళుక్యుల సామంతులే. అందుకే రుద్రదేవుడి కంటే ముందు, ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే వెయ్యి స్తంభాల గుడి కంటే ముందటి తొలి కాకతీయుల కాలం నాటి నిర్మాణాలన్నీ కళ్యాణి చాళుక్య శైలికి చెందినవే. నల్గొండ జిల్లాలోని పానుగల్లు ఆలయాలు-పచ్చల సోమేశ్వరాలయం, ఛాయా సోమేశ్వరాలయం కట్టించినవాళ్లు కందూరి చోడులు. ఈ అందమైన నిర్మాణాలు కళ్యాణి చాళుక్య రీతివే అయినా కాండూరి చోళుల గురించిన చర్చలో వాటి గురించి మరింతగా చర్చిస్తే వీటి నిర్మాతలైన తెలంగాణలో వాస్తు రీతికి అద్భుత వారసత్వాన్ని అందించిన కందూరి చోడులను గుర్తించిన వాళ్ళమవుతాం.
డా. ఎం.ఎ. శ్రీనివాసన్
81069 35000క