కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ చట్టంలో చేయాలనుకుంటున్న మార్పులు దేశాభివృద్ధికి షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చేలా ఉన్న సవరణలు రైతులు, పేదలకు విద్యుత్తు రాయితీలను దూరం చేసేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చట్టంలోని లోటుపాట్లను, నష్టాలను సమీక్షించడం అవసరం.
రాజ్యాంగం ఏం చెప్తున్నది: భారత రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లోని ఉమ్మడి జాబితాలో ‘విద్యుత్’ 38వ అంశం. రాజ్యాంగం ప్రకారం దీనిపై చట్టం చేసే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. అయితే కేంద్రం, రాష్ట్రం ఒకే అంశంపై పరస్పర విరుద్ధ చట్టాలు చేస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 254 ప్రకారం కేంద్రం చేసిన చట్టం చెల్లుబాటవుతుంది. కానీ, ‘విద్యుత్ సవరణ బిల్లు-2022’ చట్టం చేయడం అంటే కేంద్రం తన సొంత నిర్ణయాలకే ప్రాధాన్యం ఇవ్వమని కాదు, రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం దేశ, రాష్ట్ర ప్రజల, రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను గౌరవించమని కూడా. ‘విద్యుత్ సవరణ బిల్లు-2022’లో ప్రధానంగా ప్రస్తావించిన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం.
విద్యుత్ డిస్ట్రిబ్యూషన్లో ప్రైవేటుకు చోటు: ప్రైవేటు వ్యక్తులను ఆహ్వానించడానికి, వారికి కావలసిన వెసులుబాటు గురించి అంటే.. ఏదైనా ఒక వ్యక్తి డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్కు అప్లయి చేస్తే వారికి నిర్ణీత కాలవ్యవధిలో లైసెన్స్ మంజూరు చేయాలి. లేకుంటే సరైన కారణాలను చూపి తిరస్కరించాలి. ఇలా చేయకుంటే డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ మంజూరవుతుంది. కొత్త సవరణల ప్రకారం ఒకే ప్రాంతంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కరెంటును సరఫరా చేయవచ్చు. దీంతో ప్రైవేటు డిస్ట్రిబ్యూష్ కంపెనీలు కూడా పోటీపడతాయి. లాభాపేక్ష కలిగిన ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో విద్యుత్ పంపిణీ సంస్థలుంటే వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయో ఊహించలేం. ఎందుకంటే వాళ్లు అనుభవం లేని వ్యక్తులను, సిబ్బందిని నియమించుకోవచ్చు. వీళ్లు విద్యుత్ వ్యవస్థలో పనిచేయడం సులువు కాదు. వారివల్ల ఎటువంటి అవాంతరాలు ఏర్పడవచ్చునో ఊహించలేం. ఇక్కడ ముఖ్యమైన అంశమేమంటే ప్రైవేటు సంస్థలు రైతులకు, బడుగు వర్గాలకు ఇప్పుడు ప్రభుత్వ విద్యుత్తు సంస్థలు ఇస్తున్న ఉచిత విద్యుత్ పథకాలేవీ అమలు చేయవు. ప్రైవేటు విద్యుత్తు సంస్థలు రైతుల నుంచి విద్యుత్ చార్జీలు వసూలు చేస్తే వారు వ్యవసాయానికి దూరమయ్యే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడున్న నెట్వర్క్ను ప్రైవేట్ డిస్ట్రిబ్యూటర్స్కు వాడుకునేలా చూడాలి. ఈ సదుపాయం ఇవ్వకుంటే ప్రభుత్వ పరిధిలో ఉన్న ప్రస్తుత డిస్కంలకు పెనాల్టీలు పడుతాయి.
ఎన్ఎల్డీసీకు సర్వాధికారాలు: విద్యుత్ సరఫరా ఏకీకరణ ప్రాంతీయ, రాష్ర్టాల మధ్య ఏర్పర్చుకున్న ఒప్పందాల ప్రకారం ఏర్పర్చుకున్న విద్యుత్కు సరైన డబ్బులను ముందే చెల్లించని పక్షంలో విద్యుత్ను షెడ్యూల్ చేయదు. అంటే డబ్బులు ముందు చెల్లిస్తేనే విద్యుత్తును డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ఇస్తుంది. ఇకముందు ఎన్ఎల్డీసీ(నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్) ఇచ్చిన ఆదేశాలను ఆర్ఎల్డీసీ నుంచి సబ్ స్టేషన్ (అంటే ఆర్ఎల్డీసీ, ఎస్ఎల్డీసీ, జనరేటింగ్ స్టేషన్, సబ్స్టేషన్, డిస్కమ్స్) వరకు అందరూ కచ్చితంగా అమలు చేయాల్సిందే. రాష్ర్టాల విద్యుత్ సంస్థల పరిధిలో ఉన్న స్టేట్ ఎస్ఎల్డీసీలు కేవలం కేంద్ర పరిధిలో ఉన్న ఎన్ఎల్డీసీ మార్గదర్శకాలను అనుసరించి పనిచేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడున్న ఎస్ఎల్డీసీల అధికారాలు పూర్తిగా నామమాత్రమయ్యే అవకాశాలున్నాయి. అంటే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాలకున్న ఎస్ఎల్డీసీ విస్తృత అధికారాలు ఇకపై ఎన్ఎల్డీసీ ద్వారా కేంద్రం చేతుల్లోకి వెళ్తాయి. ఇదే జరిగితే కేవలం ఎన్ఎల్డీసీ ద్వారా దేశంలోని సబ్స్టేషన్ స్థాయి నుంచి రీజినల్ స్థాయి వరకు అనేక అంచెలు అంటే కొన్ని వేల సబ్స్టేషన్లు, లక్షల్లో ఉన్న ట్రాన్స్మిషన్ నెట్వర్క్, వేలల్లో ఉన్న జెనరేటింగ్ కంపెనీలను నిర్వహించడం, నియంత్రించడం సాధ్యం కాదు. అది గ్రిడ్ స్టెబిలిటీకే ప్రమాదకరం, దేశాభివృద్ధికి ఆటంకం.
ఏటా విద్యుత్ చార్జీల మోత: ఏటా మారిన/ పెరిగిన విద్యుత్ చార్జీలు ఏప్రిల్ ఒకటి నుంచి అమలవుతాయి. వినియోగదారులకు ఏటా విద్యుత్ చార్జీల మోత తప్పదు.
కనీస పునరుత్పాదకమైన విద్యుత్: ఇక ఏదైనా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పునరుత్పాదక విద్యుత్తును(ఉదా- సౌర, పవన, జల విద్యుత్తు) ముందే నిర్ణయించినంత కొనకపోతే దానికి పెనాల్టీ వేస్తారు.
ఈ విధంగా ఇంకా ఎన్నో మార్పులతో ‘విద్యుత్ సవరణ బిల్లు-2022’ రాబోతున్నది. ఈ బిల్లు అమలైతే ప్రభుత్వాల ఆధ్వర్యంలోని థర్మల్ విద్యుత్తు కేంద్రాలు మూత పడే ప్రమాదం ఉంది. ఈ చట్టం వల్ల కలిగే పర్యవసానాలు ఇంకెన్ని ఉన్నాయో మనకు తెలియదు. మొత్తంగా విద్యుత్తో చెలగాటం దేశాభివృద్ధికే ప్రమాదకరం అని చెప్పవచ్చు.
(వ్యాసకర్త: కె.వినోద్ కుమార్ , 99660 92553, అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్, టీఎస్ ట్రాన్స్కో)