Museum Home in Hyderabad | ‘Every Antique Has A Story To Tell’ ఇది పురాతన వస్తువుల గురించి ఓ నానుడి. అవును.. గతం తాలూకు జ్ఞాపకాలను పంచేది అలనాటి వస్తువులేగా! మనింట్లో తాతయ్య వాడిన కుర్చీనో, నానమ్మ ఉపయోగించిన మరచెంబో ఉంటే.. ప్రేమగా, మురిపెంగా దాచుకుంటాం. అలాంటిది, ఆయన దగ్గర దాదాపు 500 ఏండ్ల నాటి వెయ్యి పురాతన వస్తువులు ఉన్నాయి. రకరకాల ప్రాంతాల నుంచి సేకరించి.. తన ఇంటినే మ్యూజియంగా మార్చారు ఏనుగు కృష్ణమూర్తి. ఇత్తడి వస్తువులనే.. పుత్తడి సంపదలా దాచిన ఆ ఇల్లు కమ్మని జ్ఞాపకాలకు, ఘనమైన గతానికి నిలయం.
సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ హైవే మీదుగా వెళ్తుంటే.. లోతుకుంట వస్తుంది. సిగ్నల్ దగ్గర యూటర్న్ తీసుకొని స్టేట్ బ్యాంక్కు ఆనుకొని ఉన్న రోడ్డులో కొంచెం ముందుకు వెళ్లి ఫస్ట్ లెఫ్ట్.. ఆ వెంటనే ఫస్ట్ రైట్ తీసుకుంటే.. కుడివైపు నాలుగో ఇల్లు అది. తెల్లటి గేటు.. దాటుకొని లోపలికి వెళ్తే ఎదురుగా వినాయకుడి రాతి విగ్రహం. పాతకాలం నాటి పుస్తకాల అర, అందులో కొన్ని పుస్తకాలు. తలుపు ఎదురుగా రెండు పెద్దపెద్ద ఇత్తడి గంగాళాలు. తలుపు కూడా పాతదే.. దాదాపు 150 – 200 ఏండ్ల నాటిది కావచ్చు. గొళ్లెం, తలుపు చెక్కిన తీరు, తలుపు షేర్లు బిగించిన విధానం చూస్తేనే ఆ సంగతి తెలుస్తుంది. ఇంటి లోపలికి అడుగుపెడితే చాలు.. మనం హైదరాబాద్లోనే ఉన్నామా.. అన్న సందేహం వచ్చి తీరుతుంది.
ఆ ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే ఓ పెద్ద మనిషి చిరు నవ్వుతో పలకరిస్తాడు. అతని వయసు ఎనభై మూడు. పేరు ఏనుగు కృష్ణమూర్తి. ఆ వయసులోనూ కుర్రాళ్లను తలపించే చలాకీతనం. ‘రండి. బాగున్నారా? ఎండలో వచ్చారు’ అంటూ రాగి చెంబులో చల్లటి నీళ్లు అందించారు. ఇంటినిండా క్రమ పద్ధతితో, అందంగా పేర్చిన యాంటిక్ వస్తువులను ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ.. ఎక్కడినుంచి సేకరించారో, ఎప్పటివో, వాటి వెనుక ఉన్న కథ ఏమిటో వివరించారు. ఆ ఇంట్లో వాటర్ ట్యాంకర్ను తలపించే పెద్ద ఇత్తడి గంగాళం ఉంది. ఆ పక్కనే నవాబుల కాలం నాటి విసనకర్రలు ఉన్నాయి. గంగాళానికి పైన.. గోడకు దాదాపు 250 ఏళ్లనాటి చెక్క అద్దం ఉంది. దాని అరల్లో ఇత్తడి దువ్వెనలు, కాటుక దాచుకునే పాత్ర, పురాతన కుంకుమ భరిణె, తెల్ల వెంట్రుకలు తొలగించేందుకు, ముల్లు తీసేందుకు వాడే ఇత్తడి చిమ్మట, తిలకం పెట్టుకునే భరిణె, గోళ్లు కత్తిరించుకునే కత్తి .. ఇలా అందానికి మెరుగులు దిద్దుకునేందుకు వాడే ఎన్నో వస్తువులు.
ఇత్తడి, తగరం తదితర లోహాలతో ఎంతో కళాత్మకంగా డిజైన్ చేశారు వాటిని. హాల్లోని పెద్ద ర్యాక్ నిండా రకరకాల సైజుల్లో ఇత్తడి, రాగి పాత్రలు అందంగా అలంకరించి ఉన్నాయి. వాటి గురించి అడిగితే.. ‘అప్పట్లో పెళ్లి, ఒడిబియ్యం, ఇతర శుభకార్యాలకు వాడే భారీస్థాయి తాంబాళాలు ఇవి’ అని చెప్పారు కృష్ణమూర్తి. మరోవైపు మల్లెల పందిరి మంచం, 14వ శతాబ్దపు తాళపత్ర గ్రంథాలు, ఘంటం, బ్రిటిష్ కాలంనాటి టైపింగ్ మిషన్, నిజాం జమానాకు చెందిన టెలిఫోన్ కనిపించాయి. కరెంటు సౌకర్యం పూర్తిగా అందుబాటులోకి రాకముందు వాడిన.. 300 ఏళ్ల నాటి దివిటీలు, ఆ దివిటీల మీద మంట ఆరిపోకుండా సాయపడే నూనె పాత్రలూ ఉన్నాయి. దేనికదే అమూల్యం. ప్రతిదాని వెనుకా ఓ కథ. ఏదో ఓ కుటుంబ వారసత్వం. కాలక్రమంలో మాయమైపోతున్న పదకోశం. కృష్ణమూర్తి చేస్తున్న పని చిన్నదేం కాదు.
భలే వంటపాత్రలు
ఒక్కో రకమైన వంటకు ఒక్కో రకం లోహపు పాత్రలు వాడేవారట ఒకప్పుడు. వాటన్నిటినీ చూపిస్తూ.. ‘ఇందులో పప్పు కూర వండేవారు. ఇందులో చారు, సాంబారు, పచ్చిపులుసు చేస్తారు. అన్నం ఇందులో మాత్రమే వండుతారు..’ గంజి వార్చడానికి అన్నం గిన్నె మూతకు ఏర్పాటు చేసిన రంధ్రాలనూ చూపిస్తూ చక్కగా వివరిస్తారు కృష్ణమూర్తి. ‘అసలు ఇదంతా ఎప్పటినుంచి చేస్తున్నారు? పాతకాలం నాటి వస్తువులు సేకరించాలనే ఆలోచన ఎలా వచ్చింది?’ అని అడిగితే, ఆయనే ఇలా చెప్పుకొచ్చారు.. “మాది ఆంధ్రప్రదేశ్లోని సోమేశ్వరం. చెన్నైలో ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడిని. నాన్న కాలం చేసిన తర్వాత.. ఊళ్లో అమ్మ ఒక్కతే ఉండేది. ఆమెను కూడా మాతోపాటు తీసుకెళ్దాం అనుకున్నాం. సామాన్లన్నీ సర్దుకున్న తర్వాత వాహనం ఎక్కిద్దామని అమ్మ కోసం చూశాను.
నాలుగు ఇత్తడి గిన్నెలు, కొన్ని చిన్నచిన్న పాత్రలు, చపాతీలు చేసేందుకు వాడే చెక్కపీట ఇలా చాలా వస్తువులను ప్యాక్ చేసుకుంది. ‘అమ్మా.. చెన్నైలో వంట సామాన్లు ఉన్నాయి’ అని చెప్పాను. ‘నాకు సొంతంగా వండుకొని తినాలనిపిస్తే ఎలా? అందుకే ఈ పాత్రలు తెచ్చుకుంటాను. ఆ కరెంటు కుక్కర్లు, మిక్సీలు వాడటం నాకు రాదు కదా’ అని చెప్పింది. నిజానికి అమ్మ తెచ్చుకున్న పాత్రల అవసరం మాకు రాలేదు. మూలన పడేయడం ఎందుకని.. షెల్ఫ్లో పెట్టా. ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్, అతిథులు ఆ ఇత్తడి గిన్నెలు, బిందెలు చూసి ‘చాలా బాగున్నాయి. మా నానమ్మ కాలంలో వాడేవాళ్లం. ఊళ్లో ఇప్పటికీ ఉన్నాయి’ అంటూ జ్ఞాపకాలను నెమరేసుకోవడం ఆనందంగా అనిపించింది. ఆ తర్వాత నెలలో మరో అతిథి కూడా ఇలాగే స్పందించారు. అంతే.. దీంతో నాలో ఒక ఆసక్తి ఏర్పడింది.
అలా పాతకాలం నాటి వస్తువులు సేకరించాలని నిర్ణయించుకున్నా. ఎక్కడికి వెళ్లినా పాత వస్తువులు దొరుకుతాయా అని గమనిస్తుంటా. ఏదైనా కనిపిస్తే, ఎవరిదో కనుక్కొని, ఇవ్వమని అడుగుతాను. కొంతమంది ఉచితంగా ఇచ్చేస్తారు. కొంతమంది డబ్బులు తీసుకుంటారు. అలా ఇప్పటివరకు రకరకాల వస్తువులు సేకరించా. ఇత్తడి గంగాళాలు, పూజా సామాన్లు, వంట సామాన్లు, అలంకరణ సామగ్రి, దేవుడి ప్రతిమలు, సిగార్లు, అడకత్తెరలు ఇలా వెయ్యికి పైగా వస్తువులు నా దగ్గర ఉన్నాయి” అంటూ వివరిస్తారు కృష్ణమూర్తి. ఎనిమిది పదుల వయసులో కూడా ఆయన నిత్య నూతనంగా ఉన్నారంటే అందుకు కారణం ఆ పాత సామాన్లే.
మన పూర్వికులు ఏం చేసినా దానికొక అర్థం ఉంటుంది. లోహపు పాత్రల్లో వంట చేసుకొని తినడం వల్ల అందులోని మినరల్స్ మన ఒంటికి చేరేవి. ఏ వస్తువు తయారుచేసినా అందంగా, కళాత్మకంగా, దృఢంగా ఉండేలా జాగ్రత్త పడ్డారు. చాలా కాలంపాటు పాడైపోకుండా ఉండేలా డిజైన్ చేసేవారు. అందుకే.. కొన్ని వందల ఏళ్లనాటి వస్తువులు కూడా ఇంకా ఉన్నాయి. రేపటి తరాలు.. మన తాతలు, వారి తాతల లైఫ్ ైస్టెల్ ఇలా ఉండేదట. ఇలాంటి వస్తువులు వాడేవారట అని చదువుకోవడం మాత్రమే కాదు. ఆ వస్తువులు ముట్టుకొని చూసి, ఫీల్ అయ్యేలా ఈ మ్యూజియంను తీర్చిదిద్దాను. దీన్ని సందర్శించడానికి ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు. ఉండాల్సిందల్లా కాస్తంత ఉత్సాహం, ఆసక్తి మాత్రమే.
మీ అటకమీదో, స్టోర్రూమ్లోనో వృథాగా పడున్న పాత సామగ్రిని నాకు ఇవ్వగలిగితే ఇంకా సంతోషిస్తాను.
– వై.కృష్ణమూర్తి, ఫౌండర్ వైకే యాంటిక్ హోమ్ మ్యూజియం
…? సుంకరి ప్రవీణ్కుమార్
ఎన్. నరేందర్