బోధన్/ఖలీల్వాడి/ఎల్లారెడ్డి/ఆర్మూర్, ఏప్రిల్ 22: డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె తొలిరోజు బుధవారం విజయవంతమైంది. ఉమ్మడి జిల్లాలో పని చేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు, కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. దీంతో దాదాపు 90 శాతం బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మరోవైపు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక పోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇక, సమ్మెను అవకాశంగా తీసుకుని ప్రైవేట్ వాహనదారులు ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేశారు.
డిమాండ్ల సాధన కోసం సర్కారుపై సమరం పూరించిన ఆర్టీసీ కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. ఉదయం నుంచే కార్మికులు డిపోలు, బస్టాండ్ల ఎదుట బైఠాయించారు. నిజామాబాద్ డిపో-1, 2, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్, ఆర్మూర్ డిపోల నుంచి దాదాపు 90 శాతం బస్సులు బయటకు రాలేదు. నిజామాబాద్ బస్టాండ్, డిపోలలో సమ్మెకు అనుమతి ఇవ్వకపోవడంతో పాత కలెక్టరేట్ మైదానంలో కార్మికులు సమావేశమై, సమ్మె ఆవశ్యకతపై చర్చించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఏఐటీయూసీ, సీఐటీయూ మద్దతు ప్రకటించాయి. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. అటు బోధన్ బస్టాండ్లో కార్మికులు నిరసన తెలిపారు.

తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించాలని విన్నవించారు. యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలని, ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్మూర్ డిపో వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. డిపో నుంచి బస్సులు బయటకు రాలేదు. ఇక ఆర్టీసీ సమ్మె కారణంగా బస్టాండ్లు వెలవెలబోయాయి. బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్టాండ్ల సమీపంలో ప్రైవేట్ వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ప్రయాణికుల అవసరాలను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ వాహనదారులు విచ్చలవిడిగా రేట్లు పెంచేశారు.
కామారెడ్డి(మాచారెడ్డి): కామారెడ్డిలో ఆర్టీసీ కార్మికులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బస్టాండ్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై దాడికి పాల్పడ్డారని కండక్టర్ పరమేశ్తో పాటు మరికొంత మందిపై కేసులు నమోదు చేసినట్లు కామారెట్టి టౌన్ సీఐ నరహరి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సులు బయటికి వెళ్లే దారిలో కొంతమంది ఆర్టీసీ సిబ్బంది సామాన్య ప్రజలకు ఆటంకం కలిగిస్తున్నందున, అక్కడి నుంచి వెళ్లమని చెప్పిన పోలీసుల మీద దాడి చేశారని సీఐ తెలిపారు. ఈ నేపథ్యంలో కండక్టర్ పరమేశ్తో పాటు మరికొంత మందిపై కామారెడ్డి టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కండక్టర్పై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్కు రిపోర్ట్ పంపించినట్లు వివరించారు.