న్యూయార్క్: అగ్ర పారిశ్రామికవేత్త, టెస్లా అధినేత ఇలాన్ మస్క్ ఏది చేసినా సంచలనమే ఈ రోజుల్లో.. ఎలెక్ట్రిక్ కార్ల విప్లవంతో అమాంతంగా కుబేరుల జాబితాలో టాప్ కు ఎదిగిన మస్క్ అటు ప్రైవేటు అంతరిక్ష యాత్రలతోనూ కొత్తపుంతలు తొక్కుతున్నారు. అవన్నీ ఒక ఎత్తు. ఆయన బిట్కాయిన్తో ఆడుకోవడం మరొక ఎత్తు. మస్క్ ఆ వర్చువల్ కరెన్సీలో 150 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టారు. అంతేకాకుండా తమ కంపెనీ తయారు చేసే టెస్లా కార్లకు బిట్కాయిన్ కరెన్సీ చెల్లింపుల్ని అనుమతిస్తామని కూడా ప్రకటించారు. ఇది జరిగింది గత ఫిబ్రవరిలో.
బిట్కాయిన్ అంటే అనుమానంగా చూసేవారంతా ఒక్కసారిగా తిరిగిపోయారు. బిట్ కాయిన్ దశ తిరిగింది. ఎందుకంటే మస్క్ వంటి పారిశ్రామిక దిగ్గజం అక్కున చేర్చుకున్నారు కదా.. కానీ మే మధ్య నాటికి టెస్లా అధినేత మాట మార్చారు. డిజిటల్ కరెన్సీపై ట్విట్టర్ లో అనుమానాలు వ్యక్తం చేశారు. దాంతో బిట్ కాయిన్ మార్కెట్ లో డుమ్కీలు కొట్టడం మొదలైంది. షేర్ విలువ సగానికి పడిపోయి 30 వేల డాలర్ల వద్దకు చేరుకుంది. తర్వాత కొద్దిగా కోలుకుని 37 వేల వద్ద అతికష్టం మీద నిలబడగలిగింది. పోటీగా డోగెకాయిన్ అనే మరో వర్చువల్ కరెన్సీని సమర్థిస్తూ మస్క్ ట్వీట్లు పెట్టడం మరో వింత.
మస్క్ వ్యవహరించిన తీరుపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ప్రతిస్పందనలు కనిపిస్తున్నాయి. బిట్ కాయిన్ వల్ల నష్టపోయిన వారు సహజంగానే మస్క్పై మండిపడుతున్నారు. బిట్కాయిన్ను మస్క్ ఎందుకు ఆకాశానికెత్తారు.. అంతలోనే ఎందుకు పడదోశారు అనేది మాత్రం అంతుచిక్కడం లేదు. పడదోసేందుకే పైకి లేపారా అనే సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. అదే నిజమైతే ఎందుకు అనేది మరో ప్రశ్న. డోగెకాయిన్లో తనకున్న వాటాలు కాపాడుకునేందుకే బిట్కాయిన్పై ఆయన కామెంట్లు పెడుతున్నారని చెప్పుకుంటున్నారు.