‘పునీత్రాజ్కుమార్ గొప్ప నటుడు. మానవత్వం ఉన్న మనిషి. ఆయన మరణం నన్ను ఎంతో బాధపెట్టింది. పునీత్ చదివిస్తున్న పద్దెనిమిది వందల మంది పిల్లల బాధ్యతను వచ్చే ఏడాది నుంచి నేను తీసుకుంటా. స్నేహితుడిగా ఆయన కోసం నేను చేస్తున్న మంచి పని ఇది’ అని అన్నారు విశాల్. ఆర్యతో కలిసి ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఎనిమి’. ఆనంద్శంకర్ దర్శకుడు. ఎన్.వినోద్కుమార్ నిర్మిస్తున్నారు. ఈ నెల 4న విడుదలకానుంది. ఆదివారం హైదరాబాద్లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ ‘సినిమాల్లోకి రాకముందు నుంచి ఆర్యతో స్నేహం ఉంది. అతడి ఫ్రెండ్షిప్ నాకున్న గొప్ప ఆస్తి. సినిమాలో ఆర్యతో నా కాంబినేషన్లో వచ్చే ప్రతి సన్నివేశం ఉత్కంఠను పంచుతుంది’ అన్నారు. ‘ప్రాణ స్నేహితులు శత్రువులుగా ఎందుకు మారాల్సివచ్చిందనే పాయింట్తో తెరకెక్కిన చిత్రమిది. మైండ్గేమ్ ఆధారంగా వినూత్నంగా ఉంటుంది’ అని ఆర్య పేర్కొన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఈ సినిమా ద్వారా మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉందని మమతా మోహన్దాస్ చెప్పింది. విశాల్, ఆర్య పోటీపడి ఈ సినిమాలో నటించారని, వైవిధ్యమైన కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తుందని దర్శకుడు ఆనంద్శంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మృణాళికి, వినోద్ పాల్గొన్నారు.