Murder | కాలిఫోర్నియాలోని ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్న కేరళ(Keralam)కు చెందిన ఇద్దరు మహిళలు మరణించారు. అక్కడి పోలీసులు సంఘటానా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి హత్యగానిర్ధారించారు. ఓ మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ హత్యలు ఆగస్టు 28న కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో జరిగాయి. తిరువనంతపురంలోని కేశవదాసపురానికి చెందిన 40 ఏండ్ల యాన్ మేరీ మాథ్యూ కత్తిపోట్లతో, త్రిసూర్లోని ముడిక్కోడ్కు చెందిన 35 ఏండ్ల అంజన హరి కారు ఢీకొట్టడంతో మరణించారు.
మిల్పిటాస్ (Milpitas)పోలీసుల ప్రకారం మిల్క్రీక్ అపార్ట్మెంట్స్ సమీపంలోని డిక్సన్ ల్యాండింగ్ రోడ్డు వద్ద జరిగిన హిట్ అండ్ రన్ ఘటనపై ముందుగా సమాచారం అందింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి ఒక బ్లూ ఎస్యూవీ కారు అక్కడి నుంచి వెళ్లిపోయిందని చూసినవారు పోలీసులకు తెలిపారు. అలాంటి కారే సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో ఉండగా, ఆ కారు నడిపిన మిల్పిటాస్కు చెందిన 32 ఏండ్ల మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె కొట్టాయంలోని మూన్నిలావుకు చెందిన అనిల అని, ఆమె మరణించిన ఇద్దరు మహిళలకు స్నేహితురాలు అని బంధువులు తెలిపారు.
అంజన (Anjana) బంధువైన వినోద్ మాట్లాడుతూ అంజనతో వీడియో కాల్స్ మాట్లాడినప్పుడు యాన్ను చూశానని, అనిలను ఎప్పుడూ చూడలేదని అన్నారు. కానీ ఆ ముగ్గురు వేర్వేరుగా ఉద్యోగాలు చేసేవారని ఆయన తెలిపారు. అమెరికాలోని తెలిసిన వ్యక్తులు తెలిపిన వివరాల ప్రకారం అనిల అపార్ట్మెంట్లోపల యాన్ను కత్తితో పొడిచిందని, ఆ తరువాత అంజనను కారుతో ఢీకొట్టిందని ఆయన చెప్పారు. హత్యలకు గల కారణాలు ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు.
అంజన 2021లో అమెరికాకు వెళ్లి కాలిఫోర్నియాలోని ఒక పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నారు. ఆమెకు భర్త విజేశ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా కాలిఫోర్నియాలోనే పనిచేస్తున్నారు. ఆరేండ్ల కుమార్తె ఉన్నారు. యాన్ మేరీ కూడా వేరే పాఠశాలలో కంప్యూటర్ టీచర్గా పనిచేస్తున్నారు. ఈమెకు భర్త జాకబ్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.