నాన్న పనికెళ్తే.. పగటిబువ్వ తీసుకెళ్లి పాట నేర్చింది. అమ్మ చేనుకెళ్తే.. తోడుగా నాట్లేసి పాడే పద్ధతి తెలుసుకున్నది. పెండ్లయిన కొన్నాళ్లకే భర్త చనిపోయాడు. చేతిలో ఇద్దరు బిడ్డలు. తాను నేర్చుకున్న పాటనే ఉపాధిగా మార్చుకొని యాభైకి, వందకూ పాడుతూ కెరీర్ ప్రారంభించిన యంగల కుమారి పాటల ముచ్చట!
మాది ఖమ్మం జిల్లా బోనకల్ మండలం కలకోట. మా ఊరు జానపద కళలకు పెట్టింది పేరు. అమ్మానాన్న మంచి కళాకారులు. పేదరికం వల్ల కళారంగంలో స్థిరపడలేక పోయారు. నాన్న పురుషోత్తం కుప్ప కొట్టుల్ల పనికి పోయేవాడు. నేను నాన్నకు అన్నం తీసుకెళ్లేదాన్ని. వెళ్లినప్పుడల్లా నాన్న పాడే జానపదాలు వినేదాన్ని. ‘పచ్చపచ్చనీ వొయ్ రామా.. పందిళ్లా కిందా వొయ్ రామా’ వంటి పాటలు పాడేవాడు నాన్న. అమ్మ కూడా వడ్లు దంచేటప్పుడు, నాట్లేసేటప్పుడు ‘కొండా కొండల నడుమా కొండల్లో నడుమా’, ‘సందామామయ్యలో సక్కని రాజా రంగాదానియ్యలో’ వంటి పాటలు అందుకునేది. అమ్మానాన్నలు పల్లవి, చరణాలై నా పాటకు ఊపిరి పోశారు. నాకు చదువంటే ఆసక్తి. కానీ పేదరికం. ఉన్నత చదువుల వరకు వెళ్లలేకపోయాను. అమ్మతో కలిసి పనికి వెళ్లేదాన్ని. చేను, చెలకల దగ్గర అమ్మ భాగ్యమ్మ పాటలు వింటూ పనిచేసేదాన్ని.
పదిహేడేండ్ల వయసులోనే మా మేనమామతో పెండ్లి జరిగింది. కుటుంబ పరిస్థితుల వల్ల నేనూ అంగీకరించాల్సి వచ్చింది. మాకు ఇద్దరు పిల్లలు. అనారోగ్యంతో మా ఆయన చనిపోయాడు. అది నాకు కోలుకోలేని దెబ్బ. ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఎక్కడికి పోవాలి? ఎలా బతకాలి? అన్న ఆందోళన మొదలైంది. మళ్లీ కూలీ పని మొదలుపెట్టిన. కష్టాన్ని మరిచిపోవడానికి పొలాల్లో అమ్మలక్కలతో కలిసి పాటలు పాడేదాన్ని. పేదరికం, అసమానత, బాల్య వివాహం వంటివన్నీ నా జీవితంలోనూ ఉన్నాయి కాబట్టి, సామాజిక గీతాలు పాడుతున్నప్పుడు నన్ను నేను మరిచిపోయేదాన్ని. నా అనుభవంలోంచి నేనే పాటలు రాసుకొని పాడేదాన్ని. ‘జారుజారు బండమీద కోయిలో..’ వంటి అచ్చమైన జానపదాలు నేను పాడగలననే ధైర్యాన్ని నింపాయి. ఆ రోజుల్లో యూట్యూబ్, సోషల్ మీడియా లాంటివి ఉండి ఉంటే నా పాటలు మరింత ఆదరణ పొందేవేమో!
ఊళ్లలో సామాజిక రుగ్మతలు, ప్రజా సమస్యలపై అవగాహన కార్యక్రమాలు జరిగేవి అప్పట్లో. అలాంటి వేదికలపై పాడటం వల్ల పేరుతోపాటు ఎంతో కొంత డబ్బు వస్తుందని అనిపించింది. వెళ్లి అడిగాను. కోరస్గా తీసుకుంటామని చెప్పారు. అవకాశం ముఖ్యం కదా అని, సరేనన్నాను. ఒకసారి మెయిన్ సింగర్ రాలేదు. మిగతావాళ్లు తర్వాతి పాట కోసం సిద్ధం అవుతున్నారు. నేనొక్కదాన్నే ఖాళీగా కూర్చున్నాను. ఏం చేయాలో అర్థంకాక ఆలోచిస్తున్నారంతా. ‘నేను పాడతా’ అన్నాను. వాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఎలా పాడతానో అనే సందేహం. అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ మైక్ అందుకొని ‘నీళ్లతోటి నీకొచ్చే రోగాలను చూడూ.. చెల్లెలా చెంద్రమ్మా’ అనే పాట పాడాను. చప్పట్లతో ఊరంతా దద్దరిల్లిపోయింది.
తెలంగాణ ఉద్యమంలో నేనూ గజ్జెకట్టి ధూమ్ధామ్ చేశాను. ‘త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో’, ‘వీరులారా వందనం’, ‘ఆడుదాం డప్పుల్లా దరువెయ్రా’ వంటి పాటలు పాడేదాన్ని. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ‘సాంస్కృతిక సారథి’ ద్వారా కళాకారులకు ఉద్యోగాలు ఇస్తున్నట్టు కేసీఆర్ సార్ ప్రకటించడంతో నాకొక ధైర్యం వచ్చింది. తీరా వెళ్తే ‘ఖాళీలు లేవు. మళ్లీ అవకాశం ఉంటే చూద్దాం’ అన్నారు. నా గుండెల్లో పిడుగు పడ్డంత పనైంది. కండ్ల నుంచి వొలవొలా నీళ్లు దుంకుతున్నయి. ఎక్కడినుంచి చూసిండో ఏమో రసమయన్న ‘అమ్మా.. ఇక్కడ్రా’ అని పిలిచి నా గురించి అడిగారు. నా జీవితం, ఉద్యమ నేపథ్యం చెప్పాను. ‘నీకెందుకు ఇవ్వనన్నారు?’ అని మాట్లాడి ఉద్యోగం ఇప్పించారు. ఆ క్షణం నేను ఎప్పటికీ మర్చిపోను. పాట పెట్టిన భిక్షతో ఇల్లు కట్టుకున్నాను. పిల్లల పెండ్లిల్లు చేశాను. అప్పుడప్పుడూ యూట్యూబ్లోనూ జానపదాలు పాడుతున్నా. నేను పాడిన పాటల్లో
‘ఈతాకు ఇల్లంటివో చిన్నోడా తాటాకు దల్లంటివో చిన్నోడా’ పాట బాగా పేరు తీసుకొచ్చింది. ఇది మా నాన్న నేర్పించాడు.
ప్రోగ్రామ్లకు వెళ్తే రోజుకు యాభై ఇచ్చేవాళ్లు. ఆ డబ్బుతో ఇల్లు గడిచేది. క్రమంగా రెండువందల యాభై సంపాదించే స్థాయికి చేరుకున్నా. అప్పుడే, జీవితంపై ఒక నమ్మకం కలిగింది. పాట ద్వారా నా పిల్లలను బతికించుకోగలను, చదివించుకోగలను అనిపించింది. కానీ రోజూ ప్రోగ్రామ్స్ ఉండవు కదా? ఇంకో పని చూసుకోవాలని అనుకుంటున్న సమయంలోనే చర్చిలో సింగర్ కావాలని తెలిసింది. వెళ్లి అడిగాను. నా పాట నచ్చడంతో చర్చి నిర్వాహకులు అవకాశం కల్పించారు. పొద్దున చర్చిలో పాడుతూ.. సాయంత్రం బట్టలు కుట్టేదాన్ని.
దాయి శ్రీశైలం