Kedarnath Yatra : ఉత్తరాఖండ్లో సాగుతున్న కేదార్నాథ్ యాత్ర సందర్బంగా విషాదం చోటు చేసుకుంది. వాతావరణం సరిగ్గా లేకపోవడం, అనారోగ్యం కారణంగా ముగ్గురు భక్తులు మరణించారు. వారిలో ఒకరు తెలంగాణకు చెందిన భక్తుడు ఉన్నాడు. భారీ వర్షాలు, కొండ చరియలు విరిగిపడటం వంటి కారణాలతో కేదార్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండ చరియలు విరిగిపడటం వంటి కారణాలతో యాత్ర సాగడం లేదు. దీంతో ఎక్కడికక్కడ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ (ఎస్ఈఓసీ) వెల్లడించింది. మృతులు ముగ్గురు రుద్రప్రయాగ్ ప్రాంతంలోనే ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో గోపాల్ మిశ్రా (76) యాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా అనారోగ్యం కారణంగా మరణించారు. నవగంజి లక్ష్మన్జీ ఠాకూర్ (52) అనే వ్యక్తి యాత్రకు వెళ్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. తెలంగాణలోని హైదరాబాద్కు చెందిన బలగాని బలరాజ్ (49) కూడా అనారోగ్యం కారణంగా మరణించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ వాతావరణ సరిగ్గా లేకపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
భక్తులు వెళ్లే రూట్లను మూసివేసి, వారికోసం వసతులు ఏర్పాటు చేశారు. శనివారం నుంచి రుద్రప్రయాగ్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల భక్తులు వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉంది. అందుకే తాత్కాలికంగా యాత్రను నిలిపివేశారు. మళ్లీ వాతావరణం సాధారణ స్తితికి వచ్చిన తర్వాతే యాత్రను తిరిగి ప్రారంభిస్తారు. ఈ మేరకు జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీచేశారు. ఈ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భక్తులు అధికారులు సూచించిన చోట మాత్రమే ఉండాలని కోరారు.