హైదరాబాద్ : కేంద్రం నిర్వహించిన ఆన్లైన్ ఆడిటింగ్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందంటూ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హర్షం వ్యక్తం చేశారు. ఆన్లైన్ ఆడిటింగ్లో తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిన నేపథ్యంలో మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న నిధుల వినియోగం, ఖర్చు ఏ విధంగా ఉందనే విషయాలను తెలుసుకునేందుకు కేంద్రం ఆడిటింగ్ నిర్వహిస్తుందని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులకు సమానంగా నిధులు ఇస్తున్న రాష్ట్రం ఏకైక రాష్ట్రం తెలంగాణ తప్ప దేశంలో మరొకటి లేదన్నారు.
ఈ ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. అన్ని గ్రామాలను ఆడిటింగ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం గతేడాది నిర్ణయించిందని, ఆ ఏడాది 25శాతం ఆడిటింగ్ జరిగినా చాలని కేంద్రం భావించిందని, అయితే తెలంగాణలో 40శాతం మేర గ్రామాల ఆడింగ్ను అధికారులు పూర్తి చేశారని మంత్రి తెలిపారు. దీంతో పలు రాష్ట్రాలు తెలంగాణకు వచ్చి ఆడిటింగ్పై అధ్యయనం చేసి వెళ్లాయన్నారు. అయినా, కొన్ని రాష్ట్రాలు ఆడిటింగ్ను కనీసం మొదలు పెట్టలేకపోయాయని, దీంతో కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించిందని మంత్రి తెలిపారు.
సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఆడిటింగ్లో అనుసరించిన విధి విధానాలపై మన అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చారన్నారు. అయితే కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ఈ ఏడాది జూన్లోనే ఆడిటింగ్ను మొదలు పెట్టడంతో కేవలం మూడు నెలల్లోనే 28శాతం ఆడిటింగ్ పూర్తి చేసి, దేశంలో మరోసారి మొదటి స్థానంలో నిలిచామని మంత్రి వివరించారు. తండాలను సైతం పంచాయతీలుగా మార్చిన సీఎం కేసీఆర్ నిధులను క్రమం తప్పకుండా పంచాయతీలకు విడుదల చేస్తున్నారన్నారు. దీంతో ప్రతి చిన్న చిన్న గ్రామ పంచాయతీకి కూడా కనీసం నిధులు సమకూరి అభివృద్ధి జరిగే అవకాశం ఉందన్నారు.
కొత్త పంచాయతీరాజ్ చట్టం ద్వారా అభివృద్ధి పనుల నిర్ణయం, ఖర్చు స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గ్రామ పంచాయతీలకే ఇవ్వడం, అలాగే.. ఆయా పనులు ప్రయోజనకరంగా, నిధుల దుర్వినియోగం జరగకుండా, పారదర్శకంగా జరిగే విధంగా చూడడంతో రాష్ట్రంలో స్థానిక పరిపాలన అద్భుతంగా కొనసాగుతుందని మంత్రి చెప్పారు. పల్లె ప్రగతి సాధించిన ఫలితాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఇదే క్రమంలో నిర్వహిస్తున్న ఆడిట్లోనూ మన రాష్ట్రం దేశంలో నెంబర్ వన్గా నిలిచామంటూ సీఎం కేసీఆర్కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.