ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. శుక్రవారం 9,168 పోస్టులకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను వెంటనే చేపట్టాలని టీఎస్పీఎస్సీకి సూచించాం. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగార్థులకు శుభాకాంక్షలు.
-ట్విట్టర్లో మంత్రి హరీశ్రావు
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్కు రంగం సిద్ధమైంది. శుక్రవారం ఏకంగా 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. గ్రూప్-4లో మొత్తం నాలుగు క్యాటగిరీల్లో పోస్టులు మంజూరయ్యాయి. వీటిలో అత్యధికంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు-6,859 ఉన్నాయి. వార్డు ఆఫీసర్ పోస్టులు-1,862, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు-429, జూనియర్ ఆడిటర్ పోస్టులు-18 ఉన్నాయి. వీటితోపాటు గిరిజన సంక్షేమశాఖలో మరో 42 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్(గ్రేడ్)-2 ఉద్యోగాలకూ అనుమతి ఇస్తూ ఆర్థికశాఖ మరో ఉత్తర్వు జారీ చేసింది. దీంతో శుక్రవారం ఒక్కరోజే మొత్తం 9,210 పోస్టులకు ఆర్థికశాఖ అనుమతులు మంజూరు చేసినట్టయ్యింది.
రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80 వేల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన నాటినుంచి వరుసగా ఆర్థికశాఖ అనుమతులు, నియామక నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఇందులోభాగంగా గత ఆగస్టు 30 నాటికే 52,460 పోస్టులకు ఆర్థికశాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ నెల 12న విద్యాశాఖలో 134 ఉద్యోగాల భర్తీకి గ్రీన్సిగ్నల్ వచ్చింది. తాజాగా మరో 9,210 పోస్టులకు అనుమతి లభించింది. దీంతో ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన మొత్తం పోస్టుల సంఖ్య 61,804కి చేరినట్టయ్యింది. తాజాగా ఆర్థికశాఖ మంజూరు చేసిన గ్రూప్-4 పోస్టుల్లో అత్యధికంగా రెవెన్యూ శాఖలో 2,077, పంచాయితీరాజ్ శాఖలో 1,245, ఉన్నత విద్యలో 742, సాంఘిక సంక్షేమశాఖలో 474, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖలో 338 ఉన్నాయి. దీంతో ఆయా పోస్టులకు రెండు వారాల్లో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు టీఎస్పీఎస్సీ సమాయత్తమవుతున్నది.
గ్రూప్-2,3,4 పై చర్చించేందుకు శనివారం కమిషన్ కార్యాలయానికి రావాలని వివిధ శాఖల అధికారులను టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్రెడ్డి ఆదేశించారు. సోమవారం గ్రూప్-4కి సంబంధించి అన్ని శాఖల అధికారులతో టీఎస్పీఎస్సీ సమావేశం నిర్వహించనున్నది. గ్రూప్-4లో కొత్తగా మరో 4 రకాల పోస్టులను చేర్చుతూ ప్రభుత్వం గురువారమే ఉత్తర్వులు ఇచ్చింది. గ్రూప్-4లో జిల్లా కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్, జువైనల్ సర్వీసెస్ సూపర్వైజర్ మేల్, జువైనల్ సర్వీసెస్ మ్యాట్రన్ స్టోర్కీపర్, సాంకేతిక విద్యాశాఖ మ్యాట్రన్ పోస్టులు చేర్చినట్టు ఉత్తర్వుల్లో పేరొన్నది. ఇటీవలే గిరిజన రిజర్వేషన్లను సైతం ప్రభుత్వం పెంచింది. వీటన్నింటి గురించి టీఎస్పీఎస్సీ చైర్మన్తోపాటు సెక్రటరీ ఆయా శాఖల అధికారులకు తగు సూచనలు ఇవ్వనున్నారు. గ్రూప్-4 నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే గ్రూప్-2, 3కి సైతం నోటిఫికేషన్లు ఇచ్చేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తున్నది. ఆర్థికశాఖ అనుమతుల మంజూరు నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఉద్యోగార్థులకు ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలియజేశారు.
వివిధ ప్రభుత్వ శాఖల్లో 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఇవ్వడం పట్ల పలు సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. దీంతో ఆశగా వేచిచూస్తున్న ఉద్యోగార్థులకు ఉద్యోగాలు దక్కుతాయని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్, టీజీవో అధ్యక్షురాలు మమత, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు అభిప్రాయపడ్డారు. వీటి భర్తీతో ప్రభుత్వశాఖలు మరింత బలోపేతమై.. ప్రజలకు నాణ్యమైన సేవలందుతాయనే ఆశాభావం వ్యక్తంచేశారు.
6,859 జూనియర్ అసిస్టెంట్
1,862 వార్డ్ ఆఫీసర్
429 జూనియర్ అకౌంటెంట్
18 జూనియర్ ఆడిటర్
42 గిరిజన సంక్షేమ శాఖలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టులు
Big announcement!
9,168 Group-IV vacancies be filled by Direct Recruitment through TSPSC#Telangana Govt under #CMKCR Garu, the leader who is serving & fulfilling the promises & wishes, accorded Permission for filling-up of such huge number of posts.
Best wishes to aspirants. pic.twitter.com/4YBgHRAp0q— Harish Rao Thanneeru (@trsharish) November 25, 2022