తమిళ హీరో శింబు బహుముఖ ప్రజ్ఞాశాలి. నటనతో పాటు గాయకుడిగా కూడా ఆయనకు మంచి పేరుంది. గతంలో ‘బాద్షా’ ‘పోటుగాడు’ చిత్రాల్లో ఆయన గొంతు సవరించారు. చాలా కాలం విరామం తర్వాత శింబు తెలుగు చిత్రం ‘ది వారియర్’లో ఓ పాట పాడారు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్తో ఉన్న ఆత్మీయ స్నేహం వల్ల శింబు పాటను ఆలపించడానికి ఒప్పుకున్నారని చిత్ర బృందం పేర్కొంది. త్వరలో ఈ పాటను విడుదల చేయబోతున్నారు. రామ్ కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ‘ది వారియర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. జూలై 14న విడుదలకానుంది. నిర్మాత మాట్లాడుతూ ‘శింబు ఈ సినిమాలో ‘బుల్లెట్..’అనే పాటను పాడారు. మాస్ బీట్తో సాగే గీతమిది. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన బాణీకి.. శింబు గాత్రం తోడవడంతో పాట మరో స్థాయిలో తయారైంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలో హీరో రామ్ పోలీసాఫీసర్గా కనిపిస్తారు’ అని చెప్పారు. కృతిశెట్టి కథానాయికగా, ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సుజీత్ వాసుదేవ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: ఎన్.లింగుస్వామి.