‘వెలయున్ భాగవతాఖ్య కల్పతరువుర్విన్ సద్దిజ శ్రేయమై’- పరమ భాగవతుడైన పోతన మహాకవి మతంలో భాగవతం చతుర్విధ పురుషార్థాలను ప్రసాదించే పారిజాతం. చతుర్థ స్కంధంలో దక్ష చరిత్ర ద్వారా ధర్మ పురుషార్థం, ధ్రువోపాఖ్యానంలో అర్థ పురుషార్థం, పృథు కథ ద్వారా కామ పురుషార్థం నిరూపించబడినాయి.
పృథు చక్రవర్తి ప్రజలందరితో ధరణి ధేనువు నుంచి ఎవరికి ఏది కావాలో నిండుగా, దండిగా పిండుకోమన్నాడు. అలా అందరి అభిమతాలను పూరించి తాను ఆప్తకాముడు, ఆత్మారాముడయ్యాడు. ‘ఆశకు దాసులు లోకమంతటికీ దాసులే, ఆశను దాసీగా చేసుకొన్న వారికి లోకమంతా దాస్యం చేస్తుంది’ అనే సనాతన ధర్మ దర్శనానికి నిదర్శనంగా నిలిచిన నరరూప నారాయణుడు పృథువు. ఇక నాల్గవది, నాణ్యమైనది అయిన మోక్ష పురుషార్థాన్ని విశ్లేషించి వివరించడానికి ‘పురంజన’ ఉపాఖ్యానం ప్రవర్తిల్లింది. మానవ జీవిత పరమార్థాన్ని పరోక్ష పద్ధతి అనగా రూపక భాషలో బోధించే అర్థవాద (సింబాలిక్-సాంకేతిక) రూపమైన ఈ కథ భాగవత కథామాలకు మణిపూస. పురుషోత్తమావతారుడైన పృథు చక్రవర్తి యొక్క పవిత్ర వంశంలో పుట్టిన ‘బర్హిషదుడు’ అనే పేరుగల మహారాజు మహా కర్మాసక్తుడు. కర్మకాండ వ్యసనపరుడై ఆ రాజు చేసిన యజ్ఞాలలో ఆయన వినియోగించిన బర్హిస్సు (దర్భలు)ను ప్రాచీనాగ్రములుగా (తూర్పుకొసలుగా) తీర్పుగా, నేర్పుగా అలా నేలమీద పరిస్తే ఇల (భూమి)నంతా ఆక్రమిస్తాయి. అందుకే ఆ మహారాజుకి ‘ప్రాచీన బర్హి’ అనే మరో పేరు (బిరుదు) ప్రసిద్ధమయింది.
ప్రాచీన బర్హి పుత్రులు ప్రచేతసులు పరమేశ్వరుని అనుగ్రహం వలన భక్తిమార్గంలో అగ్రగాములై ముక్తిభాజనులయ్యారు. కాని, తండ్రి మాత్రం ఇంకా యజ్ఞకర్మలలోనే తలమునకలై ఉన్నాడు. మోక్షం నిత్యఫలం. అది అనిత్యమైన కర్మలతో కలుగదు. ప్రాపంచిక విషయాసక్తి కలవారికే కర్మలు రుచిస్తాయి. కాని, వివేకాసక్తునికి జ్ఞానవైరాగ్యాలే రుచికరమవుతాయి. కోటి కల్పముల పర్యంతం కర్మలు చేసినా వాటి అంతిమ ఫలం చిత్తశుద్ధి మాత్రమే. వస్తు (జ్ఞాన) సిద్ధి విచారణ వల్లనే సాధ్యం. తనకు ప్రియశిష్యుడు, పరమభక్తుడైన ధ్రువుని వంశంలో పుట్టి ప్రవృత్తి (కర్మ) మార్గంలోనే పడి కొట్టుకుంటున్న ప్రాచీనబర్హిని నివృత్తిపరునిగా (జ్ఞానిగా) ఉద్ధరించాలనే ఆశయంతో భక్తి శాస్ర్తానికి ఆచార్యుడైన నారద మహర్షి అవ్యాజమైన కరుణతో పురంజనోపాఖ్యానాన్ని ప్రవచించాడు. గో, భూ, సువర్ణ, అన్నదానాల కన్నా విద్యా (జ్ఞాన) దానం ఎంతో మిన్న. అన్నదానం వలన కలిగే తృప్తి క్షణికం. కాని, జ్ఞానదానం వలన యావజ్జీవ తృప్తి! జన్మసాఫల్యం! జీవన్ముక్తి సుఖప్రాప్తి!
నారద మహర్షి- ‘రాజా! ఎడతెరపి లేని ఈ యజ్ఞయాగాది కర్మలతో నీవు ఏమి కోరుతున్నావో చెప్పు. అన్ని దుఃఖాలను అంతమొందించి పరమానందాన్ని ప్రసాదించే మోక్ష శ్రేయస్సు మాత్రం ఈ కర్మల వలన లభించదు గదా! నరపతీ! నీవు చేసిన అపరిమితమైన యజ్ఞాలతో నీచే హింసించబడిన పరిమితిలేని పశువులు నీపై ప్రతీకార వాంఛతో రగిలిపోతూ, ఇనుప కొమ్ములతో నిన్ను కుమ్మి-కుమ్మి పొడిచే భంగిమలో నీ రాకకై నింగిలో నుంచి తొంగి-తొంగి చూస్తున్నాయి’ అని మహర్షి యోగమహిమతో వాటిని మహారాజుకు చూపించాడు. పరేతరాజు (యమ) కింకరులే ఆ పశువుల రూపంలో పొంచి ఉన్నారట! మిన్నులో ఆ వింత దృశ్యాన్ని కన్నులారా కన్న ప్రాచీనబర్హి వెన్నులో వణుకు పుట్టింది. ఖిన్నుడైన రాజు, తనకు దన్నుగా నిలుచున్న దేవర్షి నారదునితో- ‘మహర్షీ! జన్నము (యజ్ఞము) వలన కలిగే పున్నెముల మీది ఆసక్తితో నా విన్నాణం (విజ్ఞానం) నశించింది. ముక్తిమార్గాన్ని గుర్తించలేకపోతున్నా. కపటమైన ధర్మాలకు కాణాచు (నిలయా)లైన గృహాలలో కళత్ర, పుత్ర, ధన, కనక, వస్తు, వాహనాలే ప్రధాన పురుషార్థాలుగా భ్రమించి భవబంధాలలో బద్ధుడైన కాపురుషుడు (బుద్ధిహీనుడు) కైవల్యం పొందలేడు. హరిచరణ స్మరణ ధురీణా! ఉరు కరుణామయా! మహాపురుషా! శరణాగతుడనైన నాకు తరణోపాయం తెలియచెప్పు’ అని ఆర్తితో అర్థించాడు.
ఉత్కృష్టమైనదిగా భావించే వైదిక పశుహింసే ఇంతగా నికృష్టమైతే, లౌకిక జిహ్వచాపల్య పూరణానికి, అదేదో పుణ్యకార్యమైన ద్వాదశీ తిథి పారణ (భోజనం)గా జరిగే పశుమారణం గురించి ఇక పలికేదేముంది? ‘లోకంలో ఆకులు, అలములు మేస్తూ బ్రతికే అమాయకపు మేకల తోలు వలుస్తున్నారే! మరి ఏకంగా ఆ మేకలనే మేసే మూకల మాటేమిటో’ అని వాపోతూ అంటాడు ఉత్తరభారతపు వేమనగా విఖ్యాతుడైన ప్రాచీన హిందీకవి సంత్ కబీరుదాసు.
నారద ఉవాచ- ‘మహారాజా! పూర్వం పురంజనుడనే ఒక రాజు ఉండేవాడు. అతని సఖుడు (మిత్రుడు) ‘అవిజ్ఞాతుడు’. అనగా ఆయన చేసే చేష్టల (కర్మల) పరమార్థం ఇతరులెవరికీ తెలియదన్నమాట. అంటే ఆయన భగవంతుడేగా! ఎంతో విషయ పరిజ్ఞానం కలిగిన రాజు కూడా తన మిత్రుని గుర్తించిన వాడు కాదట! విష్ణు సహస్రనామాలలో విష్ణువుకి ‘అవిజ్ఞాతా’ అనే నామముంది. పురంజనుడు జీవుడైతే, అతని సఖుడు ‘అవిజ్ఞాతుడు’ దేవుడు. జీవ-ఈశ్వరులన్నమాట. సమానమైన ఖ్యాతి కలవారు కాన ముండకోపనిషత్తు జీవేశ్వరులను సఖులుగా పేర్కొంది. ‘దేహమే నేను’ అనే అభిమానం (అహంకారం) తొలగితే ‘జీవోదేవస్సనాతనః’ జీవుడే ఈశ్వరుడు! పాశబద్ధుడు జీవుడు, పాశముక్తుడు సదాశివుడు! పొట్టుతో కూడి ఉంటే వడ్లగింజ. పొట్టు తొలగితే బియ్యపు గింజ! తాను చేసిన ‘పుణ్యపాప కర్మలకు తగిన పురము (శరీరా)లను తానే సృష్టించుకొంటాడు కనుక జీవుడు ‘పురంజనుడు’. ‘నవద్వారే పురే దేహీ’ అంటూ గీత కూడా శరీరాన్ని పురమని అభివర్ణించింది. ఇంకా పురంజనుడు అంటే పురమును (శరీరాన్ని) రంజింపజేసేవాడని, పురము (దేహం)లో రంజితుడు (ఆసక్తుడు) అనగా అతిగా దేహాసక్తి కలవాడని కూడా అర్థం. నిజానికి ‘జీవకళ’ ఉన్నంత వరకేగా ఈ శరీరానికి శోభ. (సశేషం)
‘లోకంలో ఆకులు, అలములు మేస్తూ బ్రతికే అమాయకపు మేకల తోలు వలుస్తున్నారే! మరి ఏకంగా ఆ మేకలనే మేసే మూకల మాటేమిటో’ అని వాపోతూ అంటాడు ఉత్తరభారతపు వేమనగా విఖ్యాతుడైన ప్రాచీన హిందీకవి సంత్ కబీరుదాసు.
తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006