Peddi | టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’.. ఈ మూవీ రిలీజ్ డేట్ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అభిమానులకు ఎట్టకేలకు గుడ్ న్యూస్ అందింది. పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాకు సంబంధించి తాజా రిలీజ్ డేట్ను దర్శకుడు బుచ్చిబాబు సాన అధికారికంగా ప్రకటించారు. జూన్ 25న ఈ చిత్రం థియేటర్లలోకి రానుందని వెల్లడించారు. ఈ ప్రకటన తమిళ హీరో ధనుష్ నటించిన ‘కర’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగింది. ఈ వేడుకకు హాజరైన బుచ్చిబాబు సాన, యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ‘పెద్ది’ రిలీజ్ డేట్ను రివీల్ చేశారు. దీంతో ఈ మూవీపై ఉన్న అనుమానాలకు తెరపడింది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ ఈవెంట్లో మాట్లాడిన బుచ్చిబాబు, తాను నేరుగా షూటింగ్ స్పాట్ నుంచే వచ్చానని తెలిపారు.
ప్రస్తుతం సినిమాలో స్పెషల్ ఐటెం సాంగ్ షూటింగ్ జరుగుతోందని, దాంతో మొత్తం షూటింగ్ పూర్తవుతుందని చెప్పారు. ఈ పాటలో రామ్ చరణ్తో పాటు శృతి హాసన్ కనిపించనుందని సమాచారం. ఈ సాంగ్ సినిమాకే హైలైట్గా నిలుస్తుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే, ఈ చిత్రంలో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఆమె పాత్ర కూడా సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ అంచనాలను సొంతం చేసుకుంది.
మొదటిగా ‘పెద్ది’ చిత్రాన్ని మార్చి 27న విడుదల చేయాలని భావించారు. అయితే పలు కారణాల వల్ల అది ఏప్రిల్ 30కు వాయిదా పడింది. తర్వాత మరోసారి రిలీజ్ డేట్ మారడంతో జూన్లో విడుదల చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు తాజాగా జూన్ 25న సినిమా విడుదల ఖరారవడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి, పలుమార్లు వాయిదా పడిన ‘పెద్ది’ ఇప్పుడు ఫైనల్ రిలీజ్ డేట్తో ముందుకు వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ హంగామా చేయనుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.