హైదరాబాద్ : గడిచిన ఆరేండ్లుగా రాష్ర్టం అభివృద్ధి దిశలో దూసుకుపోతోంది. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయినప్పటికీ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పడిలేచిన కెరటంలా ఆర్థికంగా పుంజుకుంటున్నాం అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ స్పష్టం చేశారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కరోనా నియంత్రణలో, ఆర్థిక పునర్జీవనంలో తెలంగాణ రాష్ర్టం భేష్ సాక్షాత్తు భారత ఆర్థిక సర్వే ప్రశంసలు కురిపించడం హర్షించదగ్గ విషయమన్నారు.
2016-17లో దేశ వృద్ధి రేటు 8.03 శాతం, 2017-18లో 7 శాతం, 2018-19లో 6.1 శాతానికి, 2019-20లో 4.2 శాతానికి దిగజారింది. కరోనా ధాటికి సంపద వృద్ధి చెందలేదు. 2021లో మైనస్ 7.07 శాతానికి పడిపోయింది. తెలంగాణ ఏర్పడే సమయానికి రాష్ర్ట జీఎస్డీపీ రూ. 4,56,280 కోట్లు ఉంటే.. అది 2019-20లో రూ. 8,81,873 కోట్లకు చేరింది. ఇది సీఎం కేసీఆర్ ఆలోచన విధానాలు, పథకాల వల్లే సాధ్యమైందన్నారు.
వ్యవసాయ రంగానికి, పారిశ్రామిక రంగానికి సీఎం కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. హైదరాబాద్తో పాటు జిల్లాలకు ఐటీని విస్తరిస్తున్నారు. మిషన్ భగీరథ కింద ప్రతి గ్రామానికి సురక్షితమైన తాగునీరు అందిస్తున్నామన్నారు. రెవెన్యూ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. నూతన రెవెన్యూ చట్టాన్ని రూపొందించి భూలావాదేవీలు పారదర్శకంగా జరుపుతున్నారు. ధరణి పోర్టల్కు రాష్ర్ట వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ధరణి పోర్టల్ ద్వారా నిమిషాల్లో మ్యుటేషన్లు జరుగుతున్నాయి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారాయి. టీఎస్ బీపాస్ ద్వారా భవన నిర్మాణాలకు త్వరితగతిన అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. హైదరాబాద్లో ప్రపంచ స్థాయి కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నారని ఎమ్మెల్యే వివేకానంద పేర్కొన్నారు.