నీలగిరి, డిసెంబర్ 14 : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి విజయం సమష్టి కృషికి ఫలితమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ గెలుపుతో ఉమ్మడి నల్లగొండ జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే నడుస్తుందని స్పష్టమైందన్నారు. విజయానికి సహకరించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టే విధంగా ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా టీఆర్ఎస్ను బలపర్చినందుకు ఓటర్లకు మంత్రి జగదీశ్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో టీఆర్ఎస్కు పెరుగుతున్న ప్రజాదరణకు ఇది దిక్సూచి అని పేర్కొన్నారు. ఈ విజయంతో ఉమ్మడి జిల్లాలో పార్టీ బలమైన శక్తిగా రుపొందిందన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెట్టకుండా కుట్రలు చేసిందని, నల్లగొండ జిల్లా కంటే తక్కువ ఓట్లున్న స్థానాల్లో అభ్యర్థులను నిలిపి ఇక్కడ మాత్రం కుట్ర పూరితంగా వ్యవహరించిందని ఆరోపించారు. కానీ, టీఆర్ఎస్ శక్తి ముందు వారి కుట్రలు చెల్లలేదని అన్నారు.
టీఆర్ఎస్ సైనికుల ముందు కాంగ్రెస్ తలవంచి పలాయనం చిత్తగించిందని విమర్శించారు. జిల్లాలో ఈ గెలుపు మరింత బలాన్ని ఇచ్చిందని, ఇదే స్ఫూర్తితో మున్ముందు కూడా పని చేసి, ఈ ఎన్నికలను పునాదులుగా మార్చుకుని వచ్చే సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 60 సంవత్సరాల పాలనలో తెలంగాణ, నల్లగొండ జిల్లాకు జరిగిన నష్టాన్ని ఆరేండ్ల టీఆర్ఎస్ పాలనలో భర్తీ చేస్తున్నామని తెలిపారు. మనుషులు సృష్టించిన కరువు తప్ప ప్రకృతి తెచ్చింది కాదన్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని, రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ముందుకు తీసుకెళ్లామన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, నల్లబోతు భాస్కర్రావు, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, యాదాద్రిభువనగిరి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి తదితరులున్నారు.