సింగరేణి సీఎండీ శ్రీధర్
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : మైనింగ్ రంగంలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ దేశాభివృద్ధికి దోహదపడాలని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ పిలుపునిచ్చారు. జాతీయ మైనింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరేణి సహా మైనింగ్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. భూగర్భంలో దాగి ఉన్న అపారమైన ఖనిజనిల్వలను దేశాభివృద్ధికి అందించటంలో మైనింగ్ ఇంజినీర్లు, అధికారులు, కార్మికులు కీలకపాత్రను పోషిస్తున్నారని కొనియాడారు. అన్వేషణ, ఉత్పత్తి, సమర్థ వినియోగ లక్ష్యాలపైనే మైనింగ్ ప్రగతి ఆధారపడి ఉంటుందని, దేశ విద్యుత్తు అవసరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ బొగ్గు సంస్థలు తమ సామర్థ్యాన్ని పెంచుకోవాలని పేర్కొన్నారు.