హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. ఇవి మంగళవా రం నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చార్జీలు సైతం పెరుగనున్నాయి. తెలంగాణ రివిజన్ ఆఫ్ మా ర్కెట్ వ్యాల్యూస్ గైడ్లైన్స్ అండ్ రూల్స్-1988 ప్రకారం భూముల విలువను సవరిస్తూ ప్రభుత్వం సోమవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. విలువ పెంపుపై ఇప్పటికే అందిన నివేదిక ఆధారంగా సెక్షన్-5 ప్రకారం చర్యలు తీసుకోవాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ కమిషనర్ను ఆదేశించింది.
రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూము లు, ఫ్లాట్లకు వేర్వేరుగా విలువలను సవరించినట్టు సమాచారం. ప్రస్తుతం భూములకు ఉన్న మార్కెట్ విలువతో పోల్చితే తాజా పెంపు నామమాత్రమేనని తెలిసింది. ఇప్పటికే భూముల ధరలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పెంపుదల పెద్దగా ఉండకపోవచ్చని సమాచారం. భూ విలువల సవరింపు నేపథ్యంలో సాఫ్ట్వేర్ అప్డేట్ కోసం సోమవారం రాత్రి రిజిస్ట్రేషన్లశాఖ పోర్టల్ను తాత్కాలికంగా నిలిపివేశారు.