కోల్కతా : వివాహేతర సంబంధం ఆరోపణలపై కొందరు మహిళలు తల్లీ కూతుళ్లను వివస్త్రలను చేసి దారుణంగా కొట్టిన ఘటన పశ్చిమ బెంగాల్లో వెలుగుచూసింది. ఉత్తర 24 పరగణాల జిల్లా బంగోవ్ పట్టణంలో జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాధితుల్లో 20 ఏండ్ల జిల్లా కబడ్డీ ప్లేయర్ కూడా ఉన్నారు. నిందితులు ఆమె జుత్తును కత్తిరించి దౌర్జన్యానికి తెగబడ్డారు. బాధితురాలి గృహంపై దాడి చేసిన మహిళలు ఇంటిని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితురాలిగా గుర్తించిన స్రవంతి మాలిక్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు.
సైన్యంలో పనిచేసే తన భర్తతో బాలిక తల్లి వివాహేతర సంబంధం కలిగిఉందనే అనుమానంతో స్రవంతి తల్లీకూతుళ్లపై దాడికి పాల్పడిందని పోలీసులు చెబుతున్నారు. బాధితురాలి కుమార్తె, కబడ్డీ క్రీడాకారిణి తమపై దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్కు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా పక్కగది నుంచి తన తల్లి అరుపులు వినిపించాయని, తాను ఆ గదిలోకి వెళ్లగా కొందరు మహిళలు తన తల్లిని కొడుతున్నారని బాలిక తెలిపింది. తాను కలుగచేసుకోగా మహిళలు తనను తోసివేశారని, తమను ఇంటి నుంచి బయటకు లాగి దుస్తులు చించి జుట్టును కత్తిరించారని పేర్కొంది. దాడి నుంచి తమను ఎవరూ కాపాడలేదని చెప్పుకొచ్చింది. కాగా ఈ ఘటనలో ప్రధాన నిందితురాలిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామని బంగోవ్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి అశేష్ విక్రమ్ దస్తిదర్ వెల్లడించారు.