కేంద్రంపై జస్టిస్ ఖురేషీ కీలక వ్యాఖ్యలు
సోహ్రబుద్దీన్ కేసులో అమిత్షాను జైలుకు పంపిన జస్టిస్ ఖురేషీ
జోధ్పూర్: రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా పదవీ విరమణ పొందిన జస్టిస్ అకిల్ అబ్దుల్హమీద్ ఖురేషీ కేంద్రంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ప్రతికూల అభిప్రాయమే.. తన న్యాయ స్వతంత్రతకు నిదర్శనమని పేర్కొన్నారు. తాను దాన్ని స్వతంత్రతకు సర్టిఫికెట్గా భావిస్తానని చెప్పారు. పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడం న్యాయమూర్తుల ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. చీఫ్ జస్టిస్ బాధ్యతల చివరి రోజైన శనివారం రాజస్థాన్ హైకోర్టు బార్ అండ్ బెంచ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఖురేషీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల ప్రచురితమైన సుప్రీంకోర్టు మాజీ సీజేఐ రంజన్ గొగోయ్ ఆత్మకథను పరోక్షంగా ప్రస్తావించారు. మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి త్రిపుర హైకోర్టు సీజేగా తన పేరు సిఫారసులో చోటుచేసుకున్న మార్పులకు సంబంధించి మాజీ సీజేఐ ప్రస్తావించారని, పలు న్యాయపరమైన అభిప్రాయాల ఆధారంగా ప్రభుత్వం తనపై ప్రతికూల అభిప్రాయం కలిగివుందని ఆత్మకథలో చెప్పారని పేర్కొన్నారు.
అమిత్షాను సీబీఐ కస్టడీకి ఇచ్చి సంచలనం
జస్టిస్ ఖురేషీ దేశంలోనే అత్యంత సీనియర్గా ఉన్నప్పటికీ, ఆయనను సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా పంపకపోవడంపై న్యాయవర్గాల్లో ఇప్పటికే విస్తృతమైన చర్చ ఉన్నది. ఆయన గుజరాత్ హైకోర్టు జడ్జిగా ఉన్న సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా ఇచ్చిన పలు ఉత్తర్వుల కారణంగానే కేంద్ర ప్రభుత్వం ఆయన పదోన్నతికి మోకాలడ్డిందన్న అభిప్రాయం నెలకొన్నది. తాను గుజరాత్ హైకోర్టు జడ్జిగా ఉన్న సమయంలో సోహ్రబుద్దీన్ కేసులో నాటి గుజరాత్ హోం మంత్రి అమిత్షాను ఆయన సీబీఐ కస్టడీకి అప్పగించారు. అదేవిధంగా లోకాయుక్త నియాయకం కేసులో కూడా గుజరాత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు.
ఖురేషీపై కక్షగట్టిన మోదీ సర్కార్!
2018లో జస్టిస్ ఖురేషీ గుజరాత్ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా బాధ్యతలు చేపట్టాల్సి ఉన్న సమయంలో.. అకస్మాత్తుగా ఆయనను బాంబే హైకోర్టులో ఒక జూనియర్ జడ్జిగా బదిలీ చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ గుజరాత్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఆందోళనలు చేయడంతో పాటు ఆయనకు మద్దతుగా ఒక తీర్మానం చేశాయి. 2019 మేలో మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసినప్పటికీ, తీర్మానంలో మిగతా మూడు సిఫారసులను ఆమోదించిన మోదీ సర్కార్ జస్టిస్ ఖురేషీ నియామకాన్ని మాత్రం పక్కనపెట్టింది. కేంద్ర ప్రభుత్వ ఆలస్యంపై గుజరాత్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. దీని అనంతరం పరిణామాల నేపథ్యంలో కేంద్రం లేవనెత్తిన పలు అభ్యంతరాల తర్వాత కొలీజియం జస్టిస్ ఖురేషీని మధ్యప్రదేశ్ హైకోర్టుకు కాకుండా త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్గా నియమించాలని సిఫారసు చేసింది.