నర్సంపేట, : సంప్రదాయ సాగును వదిలి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, దీర్ఘకాలికంగా మంచి దిగుబడులనిచ్చే శ్రీగంధం సాగుకు శ్రీకారం చుట్టారు. ఒడిశా వంటి రాష్ర్టాల్లో విరివిగా సాగయ్యే ఈ తరహా పంటను వరంగల్ జిల్లాలోనే తొలిసారి సాగుచేస్తున్నారు. మన రాష్ట్రంలోనూ అక్కడక్కడ శ్రీగంధం సాగు చేస్తున్నారు. ఈ పంట సాగు వినూత్నంగా ఉంది. నల్లబెల్లి మండలం నారక్కపేటలో గటికె శ్రీనివాసరావు అనే రైతు వానకాలంలో ప్రయోగాత్మకంగా ఈ మొక్కలు సాగుచేస్తున్నారు. అంతర పంటగా ఇతర మొక్కలు నాటి పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు.
మూడేండ్లు కంటికి రెప్పలా కాపాడాలి..
శ్రీగంధం మొక్కలను నాటిన మూడేండ్ల వరకు కంటికి రెప్పలా కాపాడాలి. ఆ తర్వాత మామూలుగానే పెరిగి 20 ఫీట్ల ఎత్తు వరకు చేరతాయి. ఎప్పటికప్పుడు పరాన్నమొక్కలను పెంచుతూ పోవాలి. వీటి వల్ల ఆదాయం బాగానే ఉంది. ఈ మొక్క శాగ వచ్చే కాలంలో 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యకాలంలో ఏపుగా పెరుగుతుంది. ఈ మొక్క వేర్లు, పైపొట్టు సహా అన్నింటినీ వ్యాపారులు కొనుగోలు చేస్తారు. ఈ చెట్టు నుంచి సుగంధ ద్రవ్యాలు, నూనెలు తయారు చేస్తారు. గంధపు చెక్కలను కూడా తీస్తారు. అందువల్ల ఈ చెట్ల నాణ్యతను బట్టి వ్యాపారులు ధరను నిర్ణయిస్తారు. ఒక్కో మొక్కను రూ.2 లక్షల పైనే ధర వస్తుందని గత అనుభవాల ప్రకారం రైతులు చెబుతున్నారు. పరాన్నజీవులుగా ఉపయోగపడే మొక్కల నుంచి కూడా ఆదాయం రావడం విశేషం.
ఒక్కో మొక్కకు రూ.40
భూములను కౌలుకు ఇవ్వడం వల్ల సరిగా కౌలు చెల్లించకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో పాటు భూమికి రక్షణగా ఉండేందుకు అవసరమైన విధంగా దీర్ఘకాలిక పంటలను సాగుచేస్తే మేలని రైతులు ముందుకొస్తున్నారు. ఈక్రమంలో శ్రీనివాసరావు కుమారులు యూఎస్ఏలో ఒకరు, హైదరాబాద్లో మరొకరు ఉన్నారు. శ్రీగంధం మొక్కల సాగు శ్రేయస్కరం అన్ని వారు భావించారు. మొదట ఆ పంట విత్తనాలను ఒడిశా నుంచి తెప్పించి విత్తనాలతో మొక్కలు పెరిగేలా సొంతంగా నర్సరీని పెంచారు. అయితే కరోనా ప్రభావం వల్ల నర్సరీకీ వెళ్లకపోవడం వల్ల మొక్కలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత మల్లంపల్లి నర్సరీలో మొక్కలు ఉన్నాయని తెలుసుకొని నాటారు. ఒక్కో మొక్క ధర రూ.40కు తీసుకొచ్చి ఐదెకరాల్లో 1300 మొక్కలను జూలైలో నాటారు. 12 ఫీట్ల దూరంలో ఒక మొక్క నాటారు. నీటిని అందించేందుకు ప్రతి మొక్కకూ డ్రిప్ సౌకర్యం కల్పించారు. ఎప్పటికప్పుడు రోటవేటర్తో గడ్డిని తొలగిస్తున్నారు.
ఇది పరాన్నజీవి..
శ్రీగంధం మొక్క పరాన్నజీవి. ఇతర మొక్కల వలే ఈ మొక్క సొంతంగా ఆహారం తయారుచేసుకోలేదు. ఆహారం కోసం ఇతర మొక్కలపై ఆధారపడి దాని నుంచి తీసుకుంటాయి. అందువల్ల శ్రీగంధం మొక్కతో పాటు పక్కన మరో మొక్కను నాటడం తప్పనిసరి. శ్రీగంధం మొక్క సొంతంగా 40శాతం ఆహారాన్ని, మిగతా 60 శాతం ఆహారాన్ని ఇతర మొక్కల నుంచి తీసుకుంటుంది. మొలకెత్తే సమయంలోనే షో మొక్క పెంచాలి. ఈ మొక్క పక్కన మరో మొక్క కొలంబో కందిని సాగుచేస్తున్నారు. ఈ కొలంబో కంది మొక్క ఒకసారి నాటితే నాలుగు సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత బత్తాయి, నిమ్మ రకాలను కూడా అంతర పంటగా వేయవచ్చు. మొక్క పెరుగుతున్న కొద్దీ మహాగని, కొలరి కంది, తదితర మొక్కలను పెంచాల్సి ఉంది. ఈ చెట్ల నీడ శ్రీగంధం మీద పడకుండా ఎప్పటికప్పుడు కొమ్మలు కత్తిరించాలి.
సేంద్రియ ఎరువులే వేయాలి..
శ్రీగంధం మొక్కలను సేంద్రియ ఎరువులతోనే సాగు చేయాల్సి ఉంటుంది. సేంద్రియ ఎరువులతో సాగు చేస్తే నాణ్యమైన దిగుబడి రావడమే గాక పర్యావరణానికి మేలు కలుగుతుంది. మొక్కలపై గోమూత్రం పిచికారీ చేయాలి. ప్రస్తుతం ఎరువులు, చీడపీడల నివారణకు గుళికలు వేశామని, ఇక ముందు సేంద్రియ ఎరువులే వేయాల్సి ఉందని రైతులు చెబుతున్నారు.
కౌలుకిస్తే లాభం లేదని..
శ్రీ గంధం మొక్కల పెంపకంతో లాభం బాటుంటుందని తెలుసుకొని సాగుచేస్తున్నాం. ప్రత్యామ్నాయ పంటల సాగుతోనే ఎంతో మేలు. భూములను కౌలుకు ఇవ్వడం వల్ల పెద్దగా లాభం ఉండడం లేదు. ఒకసారి మొక్కలు నాటి మూడేండ్లు జాగ్రత్తగా చూస్తే చాలు. 20 ఏండ్ల వరకు పంట చేతికొస్తుంది. ప్రస్తుతం ఈ చెట్ల మార్కెటింగ్ ఇతర రాష్ర్టాల్లో ఉంది. ఈ ప్రాంతంలో సాగు చేయడం ఇదే మొదలు. కూలీల అవసరం పెద్దగా ఉండదు. సేంద్రియ ఎరువులే వాడాలి. చీడపీడలు, బలానికి గోమూత్రం స్ప్రే చేయాలి. సాగు పద్ధతులు క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతే ముందుకొచ్చాం. కరీంనగర్ జిల్లాలో ఓ రైతు సాగు చేస్తుండగా పరిశీలించాం. నాలుగు నెలల కిందట తెచ్చి నాటాం. ఇప్పుడు బాగానే ఉన్నాయి.
ఐదు రోజులకు ఒకసారి నీళ్లు పెడ్తున్నం..
శ్రీగంధం మొక్కలకు ప్రతీ ఐదు రోజులకోసారి నీళ్లు అందిస్తున్నాం. డ్రిప్ పైపులను ప్రతీ మొక్కకు వేశాం. పరాన్నజీవులుగా షో మొక్క నాటాం. తర్వాత కొలంబో కందిని నాటాం. వీటి నీడ శ్రీగంధం మొక్కపై పడకుండా కట్ చేస్తుండాలి. మొక్కలు చీడపీడల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నం. కలుపు మొక్కలతో కూడా శ్రీగంధం మొక్క ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. శ్రీగంధం గతంలో ఈ ప్రాంతంలో ఎవరూ సాగు చేయలేదు. ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. సేంద్రియ ఎరువులే వేయాలి.