బాంబోలిమ్: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్(హెచ్ఎఫ్సీ) సెమీఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. గత సీజన్లకు భిన్నంగా అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్న హెచ్ఎఫ్సీ మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే టాప్-4లో నిలిచి సెమీస్ పోరులో నిలిచింది. బుధవారం ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో హెచ్ఎఫ్సీ 2-1 తేడాతో కేరళ బ్లాస్టర్స్పై విజయం సాధించింది. హెచ్ఎఫ్సీ తరఫున ఓగ్బాచె(28ని), సివెరియో(87ని) గోల్స్ చేయగా, విన్సీ(90ని)..కేరళకు ఏకైక గోల్ అందించాడు. ఈ విజయంతో 18 మ్యాచ్ల్లో 10 విజయాలతో 35 పాయింట్లు ఖాతాలో వేసుకున్న హైదరాబాద్ ఈ సీజన్లో సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచింది.