Hyderabad | ఆరు నెలల కిందటే పెళ్లి జరిగింది. భార్య ఆరు నెలల గర్భవతి. ఎంతో ఆనందంగా సాగాల్సిన ఆ దంపతుల జీవితంలో అనుమానం చిచ్చు పెట్టింది. చివరకు భర్త చేతిలోనే ఆమె దారుణ హత్యకు గురైంది. హైదరాబాద్లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
అల్వాల్ పరిధిలోని సూర్యనగర్లో ఆరు నెలల గర్భవతిగా ఉన్న భార్యను భర్త పరశురామ్ గొంతు నులిమి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న అల్వాల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. శివాని, పరశురామ్కు ఆరు నెలల కిందటే పెళ్లి జరిగింది. భార్యపై అనుమానంతోనే పరశురామ్ ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే హత్యకు అసలు కారణం ఏమిటన్నది ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు. కుటుంబ కలహాలు, ఇతర కారణాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసిన అల్వాల్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. క్లూస్ టీమ్ను రంగంలోకి దించి సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదికతో పాటు దర్యాప్తులో లభించే ఆధారాల ఆధారంగా హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.