వీణవంక: దళితుల ఆర్థికాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ తీసుకోచ్చిన దళితబంధు పథకాన్ని, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ తన పార్టీ నాయకుడి ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేపించి దళతబంధును ఆపించారని, దళితుల నోటికాడి బుక్కను అడ్డుకొన్నబీజేపీ పార్టీకి దళితులందరూ తమ ఓటుతో బుద్ది చెప్పాలని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే అరెపల్లి మోహన్ పిలుపు నిచ్చారు. మండల కేంద్రంలో బుధవారం విలేకరుల సమావేశంలో దళిత నాయకులతో కలిసి మాట్లాడారు.
జాతీయ పార్టీలు అని చెప్పుకుంటున్న కాంగ్రెస్, బీజేపీలకు దళితుల కోసం ప్రత్యేక ఎజెండా లేదన్నారు. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా దళితుల కోసం ప్రత్యేకంగా పథకాల తీసుకరాలేదని, దళితుల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకోచ్చిన ముఖ్యమంతి కేసీఆరేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలలో రిజర్వేషన్లు తొలగించడానికి లాభాల బాటలో నడుస్తున్న సంస్థలను ప్రైవేటీకరిస్తుందని విమర్శించారు. బీజేపీ దళిత వ్యతిరేక పార్టీఅని దానిని నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ దేశంలో దళితుల, అణగారిన వర్గాల రిజర్వేషన్లు తొలగించడానికి రహస్య కుట్రలు పన్నుతుందని ఆరోపించారు.
బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని కుట్రలకు తెరలేపినా దళితజాతి మొత్తం టీఆర్ఎస్ వైపే ఉందని తెలిపారు. దళితులు తమకు సహాయం చేసిన వారికి నమ్మకంగా, విశ్వాసంగా ఉంటారని చెప్పారు. దళిత వాడలలో విద్వేషాలు పెంచాలనే ప్రయత్నం చేస్తున్న బీజేపీ నాయకులకు ఓటు తో బుద్ది చెబుతామన్నారు.