అగ్ర హీరో చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’. మోహన్ రాజా దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ పతాకాలపై కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలో నయనతార, బాలీవుడ్ హీరో సల్మాన్ఖాన్, సత్యదేవ్, సునీల్, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకులముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఇటీవల ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ..‘ సినిమాలో ఏదైనా వైవిధ్యంగా ఉండాలని కోరుకునే నటుడిని నేను. చరణ్ నా ఆలోచనను నిరంతరం పరిశీలిస్తుంటారు. లూసీఫర్ గురించి చరణ్ చెప్పినప్పుడు నాకు నిజంగా కొత్త మూవీ అవుతుందని నమ్మకం కలిగింది. ఈ సినిమా విజయం సాధిస్తుందనే పూర్తి నమ్మకం ఉంది.
మాతృకను మన తెలుగు ప్రేక్షకులకు తగినట్లు దర్శకుడు మంచి మార్పులు చేశారు. నా ఇమేజ్కు తగినట్లు పాటలు, హీరోయిన్తో స్టెప్పులు లేవని ఎవరూ అనుకోవాల్సిన అవసరం లేదు. నేను చేసిన బ్రహ్మ క్యారెక్టర్ను అందరూ ఇష్టపడతారు. టీమ్ అందరూ సినిమాను ప్రేమించి పనిచేశారు’ అన్నారు. దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ…‘నా పదో సినిమా మెగాస్టార్తో చేయడం గర్వంగా ఉంది. చిరంజీవి గారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఇందులో ఆయన కళ్లతోనే గ్రేట్ యాక్షన్ చూపించారు. నయనతార, సల్మాన్, సత్యదేవ్ పాత్రలు ప్రతి ఒక్కరిని మెప్పిస్తాయి. చిరు అభిమానిగానే సినిమాను ఇంత ఆకట్టుకునేలా తెరకెక్కించానని అనుకుంటున్నాను’ అన్నారు.
నిర్మాత ఆర్బీ చౌదరి మాట్లాడుతూ…‘చిరంజీవి గారితో తొలిసారి సినిమాను నిర్మించడం ఆనందంగా ఉంది. చరణ్ వల్లే ఈ ప్రాజెక్ట్ మొదలైంది. ఆయనకు కృతజ్ఞతలు’ అన్నారు. సత్యదేవ్ మాట్లాడుతూ.. అన్నయ్య చిరంజీవి అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం, ఆయనంటే చాలా ప్రేమ. ఆయనపై వున్న ప్రేమతో ఇండస్ట్రీ కి వచ్చాను. చిరంజీవి గారితో కలసి నటించడంతో ఒక కల తీరిన అనుభూతి కలుగుతున్నది. దర్శకుడు మోహన్ రాజా ఈ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేసిన తీరు అద్భుతం. నిర్మాతలు ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎన్వీ ప్రసాద్, సత్యదేవ్ తదితరులు పాల్గొన్నారు.