(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలిచిన భారత్లో జనాభా పెరుగుదల రేటులో క్రమంగా క్షీణత కనిపిస్తున్నది. ఇది ఇలాగే కొనసాగితే, పనిచేయగల శ్రామికశక్తి తగ్గిపోయి, వృద్ధుల జనాభా విపరీతంగా పెరుగుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా ఉత్పాదకత తగ్గి ఆర్థికవ్యవస్థే కుప్పకూలే ప్రమాదం పొంచి ఉందన్న భయాలు మొదలయ్యాయి. దీంతో జనాభా పెరుగుదల రేటులో క్షీణతకు గల కారణాలను నిపుణులు విశ్లేషించడం ప్రారంభించారు.
ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు, ఒత్తిడి కారణంగా యువత సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతున్నట్టు కొన్ని నివేదికలు వెల్లడించాయి. జనాభా పెరుగుదల రేటుపై దీని ప్రభావం పడినట్టు వివరించాయి. అయితే, పైండ్లెన కొత్త జంటలు మునుపటిలా సంతానంపై ఆసక్తితో లేరని, పెరుగుతున్న ఖర్చులే దీనికి ప్రధాన కారణమని మెజారిటీ నివేదికలు తేల్చిచెప్పాయి. నగరాల్లో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ మిగులుతున్న సంపాదన అంతంత మాత్రమేనని, దీంతో కొత్త జంటలు సంతానాన్ని వాయిదా వేయడం, లేదా అసలే వద్దనుకోవడం చేస్తున్నట్టు ‘మింట్’ ఓ నివేదికలో వెల్లడించింది.
కాన్పు దగ్గరినుంచి పిల్లలకు డైపర్లు, వ్యాక్సిన్లు, వైద్య ఖర్చులు, బట్టలు, స్కూలు, కళాశాల ఫీజులు, ఇంట్లో భోజనం, వినోదం, ఇతరత్రా ఖర్చులు.. బిడ్డ డిగ్రీ పట్టా పొంది ఉద్యోగం సంపాదించేవరకూ ఒక్కో భారతీయుడు తన సంతానంపై కనీసం రూ. 65 లక్షల నుంచి రూ. 80 లక్షల వరకూ ఖర్చు చేస్తున్నట్టు ఎడ్-ఫిన్టెక్ కంపెనీ ‘ఎడ్యూ ఫండ్’ తన నివేదికలో పేర్కొంది. సగటున ఈ ఖర్చును రూ. 75 లక్షలుగా అంచనా వేసింది. మెడిసిన్ వంటి కోర్సులను చదివితే రూ.95 లక్షలు, విదేశాల్లో చదివితే రూ.1.5 కోట్ల పైమాటేనని తేల్చిచెప్పింది.