గోదావరి బేసిన్లో తుమ్మిడిహట్టికి ప్రత్యామ్నాయంగా వార్ధా నదిపై బరాజ్ కట్టాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టడం విస్మయం కలిగించింది. ఇది తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి ఉన్న అననుకూల పరిస్థితులపై అవగాహన లేకుండా చేసిన వ్యాఖ్యలుగా భావించాలి.
ప్రత్యామ్నాయ ఆలోచన పాతదే..
ప్రభుత్వం తుమ్మిడిహట్టి బరాజ్ స్థలాన్ని మార్చాలన్న ఆలోచన చేసిన మాట వాస్తవమే. అయితే ఈ ఆలోచన ఇప్పటిది కాదు. 2016లోనే ఈ మథనం మొదలైంది. 2016 మార్చి19న హైదరాబాద్లో జరిగిన ‘బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు అంతర్రాష్ట్ర సమన్వయ కమిటీ’ మొదటి సమావేశంలోనే ఆనాటి ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాజెక్టుల చీఫ్ ఇంజినీర్ ఈ ప్రతిపాదనను చర్చించారు. మహారాష్ట్ర అధికారులు కూడా తమకు ప్రాజెక్టు వివరాలు పంపితే పరిశీలిస్తామన్నారు.
ఈ చర్చ అంతా సమావేశపు మినిట్స్లో పొందుపరచడం జరిగింది. వార్ధాపై బరాజ్ నిర్మాణానికి అనుకూలమా కాదా? నీటి లభ్యత ఎంత ఉంది? అన్నఅంశాలను అధ్యయనం చేసి ప్రాథమిక నివేదికను సమర్పించమని కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘వాప్కోస్’కు ప్రభుత్వం పురమాయించింది. ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి ఆదిలాబాద్ చీఫ్ ఇంజినీర్ సమర్పించారు. ఆనాటి నుంచి వార్ధాపై బరాజ్ నిర్మాణానికి సంబంధించి మేధో మథనం జరుగుతూనే ఉన్నది. ప్రభుత్వం ఇటీవలే వార్ధాపై బరాజ్ నిర్మాణానికి నిర్ణయం తీసుకోవడం, 2021 నవంబర్ 20న జీవో- 410 జారీ చేసి వార్ధా నదిపై బరాజ్ నిర్మాణానికి సవివరమైన ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) తయారు చేయమని వాప్కోస్ను ఆదేశించడం స్వాగతించాల్సిన విషయం.
ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు రీఇంజనీరింగ్..
ఇప్పుడున్న తుమ్మిడిహట్టి స్థలం వద్ద బరాజ్ నిర్మాణానికి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో భాగంగా మొదట్లో స్థలాన్ని ఎంపిక చెయ్యడంలోనే పొరపాట్లు చేసింది. ఆ స్థలమే బరాజ్ నిర్మాణానికి గుదిబండగా మారింది. బరాజ్ కంట్రోల్ లెవెల్స్ అనగా పూర్తి స్థాయి నీటిమట్టం (ఎఫ్ఆర్ఎల్), బ్యారేజి గేటు కనిష్ట మట్టం (సిల్ లెవల్), ముంపు తదితర సాంకేతిక అంశాలను నిర్ధారించేటప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించలేదు. వారి అంగీకారాన్ని పొందకుండా ఏకపక్షంగా ముందుకు పోయింది. బరాజ్ స్థలాన్ని చాప్రాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి అతి సమీప ప్రాంతంలో పెట్టారు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని 2008లోనే ‘సీడబ్ల్యూసీ’ ప్రభుత్వానికి లేఖ రాసింది. మహారాష్ట్ర తమ భూభాగంలో ముంపు ను అనుమతించే ప్రశ్నే లేదని తెగేసి చెప్పింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును ‘రీ ఇంజినీరింగ్’ చేసి తుమ్మిడి హట్టి వద్ద తరలించవలసిన 20 టీఎంసీల నీటిని ఆదిలాబాద్ తూర్పు జిల్లా అవసరాలకు వినియోగించుకొని, మిగతా జిల్లాల అవసరాలకు కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మించిన సంగతి తెలిసిందే. రీ ఇంజినీరింగ్ తర్వాత తుమ్మిడిహట్టి బరాజ్ నుంచి 20 టీఎంసీల నీటిని వినియోగించుకొని ఆదిలాబాద్ తూర్పు జిల్లాలో(ఇప్పుడు ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలు) 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది డా.బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు లక్ష్యం.
ఉమ్మడి ప్రభుత్వం ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత తగినంత లేదని చెప్పిన సీడబ్ల్యూసీ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మాణమైన మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఉన్నదని తేల్చింది. 2017 అక్టోబర్లో కేంద్ర జల సంఘం కాళేశ్వరం ప్రాజెక్టుకు నీటి లభ్యతపై హైడ్రాలజి అనుమతిని మంజూరు చేసింది. మేడిగడ్డ వద్ద 284టీఎంసీ ల నీటి లభ్యత ఉన్నదని, ఈ నీటిని వినియోగించుకోవడానికి తెలంగాణకు అనుమతి ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు హైడ్రాలజి అనుమతి ఇచ్చేటప్పడు ప్రాణహిత ప్రాజెక్టులో వినియోగించుకోవాల్సిన 20 టీఎంసీలను కూడా లెక్కలోకి తీసుకున్నారు.
మహారాష్ట్రతో చారిత్రాత్మక ఒప్పందం:
తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర వ్యక్తం చేసిన అభ్యంతరాలను పట్టించుకున్నది. వారు కోరుతున్నట్టు బరాజ్ ఎఫ్ఆర్ఎల్ని 152 మీ.ల నుంచి 148 మీ.లకు తగ్గించి బరాజ్ నిర్మాణానికి అంగీకరించింది. మహారాష్ట్రలో ముంపును గణనీయంగా తగ్గించింది. పొరుగు రాష్ర్టాలతో ఘర్షణ వైఖరిని విడనాడి ఇచ్చి పుచ్చుకునే వైఖరితో మహారాష్ట్రతో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నది. దశాబ్దాలుగా అంతర్రాష్ట్ర వివాదాల్లో మగ్గుతున్న పెన్గంగ, ప్రాణహిత బరాజ్ల నిర్మాణానికి, అదనంగా గోదావరిపై మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకారాన్ని పొందింది. వీటిల్లో పెన్గంగ, మేడిగడ్డ బరాజ్ల నిర్మాణ పనులు పూర్తయినాయి. ఇప్పడు ప్రాణహిత బరాజ్పై కూడా స్పష్టత వచ్చింది. తుమ్మిడిహట్టి వద్ద నుంచి ఆదిలాబాద్ జిల్లా అవసరాలకు తీసుకునే నీరు 20 టీఎంసీలు. బరాజ్ని 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తో నిర్మించడానికి మహారాష్ట్ర అంగీకరించింది. అయితే బరాజ్ స్థలం చాప్రాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి దగ్గరగా ఉన్నది కాబట్టి జాతీయ వన్య ప్రాణి బోర్డు నుంచి, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు రాకుండా బరాజ్ నిర్మాణం చేయలేం.
వార్ధాపై బ్యారేజి ఎందుకు ?
ఇక తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ అలైన్మెంట్ నదీ ప్రవాహానికి 40 డిగ్రీల కోణంలో(skew)రావడం వలన బరాజ్ పొడవు పెరిగింది. మట్టికట్టలు, కాంక్రీట్ బరాజ్ కలుపుకొని మొత్తం పొడవు 6.45 కి.మీ. ఈ డిజైన్తో 2007-08 రేట్లతో అంచనా వ్యయం 1700 కోట్లు. ఇప్పటి రేట్లతో సుమారు 2500 కోట్లు అవుతుంది. సాధారణంగా నీటి ప్రవాహం బరాజ్కి లంబకోణంలో (90 డిగ్రీలు) ఉండాలి. Skew బరాజ్ డిజైన్లు తయారుచేయడం అంత తేలికైన విషయం కాదు. ఇకపోతే అక్కడి నుంచి తీసుకోబోయే నీరు 20 టీఎంసీలు మాత్రమే. బరాజ్ ఎఫ్ఆర్ఎల్ను 148 మీటర్లకు తగ్గించిన తర్వాత నీటి నిల్వ 1.50 టీఎంసీలు మాత్రమే. వార్ధా నదిలో నికర నీటి లభ్యత చూసినప్పుడు 45 టీఎంసీలు ఉన్నట్టు వాప్కోస్ ప్రాథమిక అంచనా వేసింది. ఆదిలాబాద్ జిల్లా అవసరాలకు 20 టీఎంసీలు వార్ధా నదిలో నుంచే పొందవచ్చు. బరాజ్ స్థలాన్ని 5 కి.మీ. వార్ధా నది ఎగువన ఆసిఫాబాద్ జిల్లా, కౌటాలా మండలంలోని వీర్దండి గ్రామ వద్దకు మారిస్తే బరాజ్ పొడవు 632 మీటర్లకు తగ్గుతుంది. బరాజ్ ఎఫ్ఆర్ఎల్ 160 మీటర్ల వద్ద నీటి నిల్వ 4 టీఎంసీలు ఉంటుంది. బరాజ్ అంచనా వ్యయం 1000 కోట్లలోపే ఉంటుంది. వార్ధా నదికి రెండు వైపులా కర కట్టలను నిర్మిస్తే ముంపు కూడా నదీగర్భంలోనే ఉండేట్టు చేయవచ్చు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బరాజ్లను ఈ పద్ధతిలోనే నిర్మించారు.
వార్ధా బ్యారేజీతో మేదిగడ్డ బ్యారేజీకి ముప్పు లేదు :
తుమ్మిడిహట్టి వద్ద 6.45 కి మీ పొడవైన బరాజ్ నిర్మిస్తే 107 గేట్లు పెట్టాల్సి వచ్చేది. నీటి నిల్వ 1.5 టీఎంసీలు మాత్రమే. తుమ్మిడిహట్టి ఎడమ వైపున ఆనుకొనే చాప్రాల్ ఉన్నందున పర్యావరణ అనుమతి పొందడం కష్టం.1.5 టీఎంసీ ల నిల్వ కోసం ఇంత పొడవైన బరాజ్ని 2500 కోట్లతో నిర్మించాలనడం భావ్యమా? సుమారు 1500 కోట్లు ఆదా అవుతున్న వార్ధా బరాజ్ ప్రతిపాదనను విమర్శించడం తగదు. వార్ధా బరాజ్లో నిల్వ ఉండేది 4 టీఎంసీలు మాత్రమే. ఈ నిల్వ కారణంగా మేడిగడ్డ బరాజ్కి జరిగే నష్టం శూన్యం. పైగా వైన్ గంగ నదికి ఏ అడ్డంకి లేకపోవడంతో ఆ నీళ్లు మేడిగడ్డకు చేరుకుంటాయి. తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మించినా అక్కడ నిల్వ ఉండేది 1.50 టీఎంసీలు మాత్రమే. బరాజ్ ఎక్కడ నిర్మించినా మేడిగడ్డ వద్ద నీటి లభ్యతకు ఎలాంటి ముప్పు లేదు. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల రైతాంగానికి మేలు చేకూర్చే ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించటం ప్రజానుకూలం కాదు.
(వ్యాసకర్త: విశ్రాంత చీఫ్ ఇంజనీర్)
కొండపల్లి
వేణుగోపాల రావు