నాగార్జునకొండ ప్రాంతంలో బయటపడినవి దేశంలోనే తొలి వైదిక ఆలయాలు. వైదిక ఆలయాల నిర్మాణం పెద్ద ఎత్తున గుప్తుల కాలంలో జరుగగా, అంతకు మునుపే కృష్ణా లోయ ప్రాంతంలో ఇక్ష్వాకుల పాలనలో నిర్మాణమయ్యాయి. అంటే వైదిక ఆలయాల వాస్తు శైలి ఇక్కడే రెక్క విప్పింది. ఏలేశ్వరంలో, నాగార్జునకొండ పరిసరాల్లో నిర్మాణమైనవి మన దేశ చరిత్రలో మొదటి వైదిక ఆలయాలు.
తెలంగాణ చరిత్ర గోదావరి కృష్ణా నదుల మధ్య చరిత్ర. గోదావరి శాతవాహన రాజ్యానికి జన్మనిస్తే కృష్ణ ఇక్ష్వాకు వంశానికి పురుడు పోసింది. శాతవాహన సామ్రాజ్య పతనంతో పుట్టిన రాజ్యాల్లో ఇక్ష్వాకు రాజ్యం ఒకటి. వీరే కాకుండా ఛూటులు, వాకాటకులు, అభీరులు, ఇలా కొత్త రాజ వంశాలు మొదలైనాయి. కృష్ణా పరీవాహక ప్రాంతమైన జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆలంపూర్ సహా నల్లమల, తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం జిల్లాలు, కృష్ణా నదికి అవతలి ఒడ్డున ఉన్న ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతం ఇక్ష్వాకు రాజ్య భూభాగం. ఈ మొత్తం ప్రాంతానికి కేంద్రం నల్గొండ జిల్లాలో నేడు నాగార్జునసాగర్గా పిలుచుకుంటున్న విజయపురి. దీనినే ఇక్ష్వాకు కాలంలో శ్రీ పర్వత ప్రాంతం అని కూడా అనేవారు.
తెలంగాణ చరిత్రలో, కృష్ణా లోయ పరీవాహక ప్రాంత చరిత్రలో చెరగని ముద్ర ఇక్షాకులది. శాతవాహనుల తర్వాత వారి కొనసాగింపుగా తెలంగాణలో పెద్ద భూభాగాన్ని పాలించిన వారు ఇక్ష్వాకులు. పాలించింది వందేండ్లలోపే అయినా తెలంగాణతోసహా మొత్తం కృష్ణా లోయలో వారి ఛాయలు ఇప్పటికీ పురావస్తు ఆధారాలుగా మన ముందున్నాయి. ఇక్ష్వాకుల ఆధారాల్ని అందించిన అన్వేషణల్ని, తవ్వకాల్ని రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి ప్రస్తుతం నాగార్జునకొండ అని పిలుచుకుంటున్న ప్రాంతాల్లో 1947 ముందు, ఆ తర్వాత జరిపిన తవ్వకాలు. రెండోది.. నాగార్జునకొండకు దూరంగా కృష్ణా, ఉపనదులు, ఏరుల వెంట ఎదిగిన ఇక్ష్వాకుల కాలం నాటి చరిత్రను ఇప్పటికీ దాచుకున్న ఫణిగిరి, వర్ధమానుకోట, నేలకొండపల్లి, గాజులబండ వంటి ఊర్లలో జరిపిన తవ్వకాలు. ఇక్ష్వాకుల చరిత్రను చెప్పేవి భౌతిక ఆధారాలైన శాసనాలు, నాణేలు, తవ్వకాల్లో దొరికిన మత సంబంధిత, మతేతర నిర్మాణాలు-ఇతర సామాగ్రి, వైదిక సాహిత్యంలో భాగమైన పురాణాలు.
ఇక్ష్వాకుల పుట్టుక: శాతవాహనుల కాలంలో వారి కింద ‘మహా తలవరలు’గా ఉన్న ఇక్ష్వాకులు శాతవాహన చివరి రాజైన నాలుగో పులుమావి తర్వాత స్వతంత్రులైనారు. ఈ రాజ్యానికి రాజధాని విజయపురి. ఇప్పటికీ నాగార్జునసాగర్కు రెండు వైపులా ఉన్న నార్త్ విజయపురి, సౌత్ విజయపురి పేర్లు దీనినుంచి వచ్చినవే. విజయపురి పట్టణం శాతవాహన కాలంలో నిర్మితమైనదే. ఇందుకు ఆధారమైన శాసనం ఒక స్తంభంపై నాగార్జున కొండ తవ్వకాలలో దొరికింది. ప్రాకృతభాషలో ఇక్ష్వాకుల కాలం నాటి బ్రాహ్మీ లిపిలో ఉన్న ఈ శాసనం విజయపురి ప్రారంభం గురించి తెలియజేస్తుంది.
నమో భగవతో అగపొగలస
రణో గోతమీపుతస సిరి విజయ స-
త కణ్ణిస సవా 6 గి ప దివా వెస-
ఖ పునిమ
దీని అర్థం, సర్వ జీవ శ్రేష్ఠుడైన (బుద్ధ) భగవానునికి నమస్కారము. రాజ గౌతమీపుత్ర శ్రీ విజయ సాత కణ్ణి 6వ రాజ్య సంవత్సరమందు గ్రీష్మ రుతువు 4వ పక్షమునందు వైశాఖ పూర్ణిమ నాడు (ఈ స్తంభము ప్రతిష్ఠించబడెను). అంటే శాతవాహన రాజైన విజయశ్రీ శాతకర్ణి పాలనలోనే వారి అధికారులు (మహాతలవరలు) అయిన ఇక్ష్వాకుల ప్రాంతంలో విజయపురికి పునాది పడింది. అందుకే నాగార్జునకొండతోపాటు అన్ని ఇక్ష్వాకుల కాలపు పురాతత్వ ప్రదేశాల్లోనూ మనకు శాతవాహన నాణేలు కూడా దొరుకుతాయి. శాతవాహన కాలంలో విస్తరించిన బౌద్ధం వీరి కాలంలో మరింత పరిణతి చెంది కనిపిస్తుంది. ఇక్ష్వాకుల ప్రతి శాసనం ’నమో భగవతో’ అని బుద్ధ వందనంతోనే మొదలవుతుంది.
ఇక్ష్వాకుల మూలం ఎక్కడుంది?
ఇక్ష్వాకులు ఉత్తర భారతానికి చెందిన సూర్యవంశ క్షత్రియులని, రాముడి వంశస్థులనీ పురాణాలు చెపుతాయి. అయితే ఈ వాదనను బలపరిచే ఆధారాలు పూర్తిగా లేవు. నాగార్జునకొండ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో దొరికిన పుష్పభద్ర స్వామి (శివ) ఆలయ స్తంభంపై ఉన్న ఇక్ష్వాకు రాజైన ఎహువల చాంతమూల కాలం నాటి శాసనంలో ‘మహారాజస్య సగర-దిలీప-అంబరీష-యుధిష్ఠిర తుల్య ధర్మవిజయ రామస్యేవ సర్వజన అభిరామాస్య ఇక్ష్వాకునాం’ అని చెప్పుకోవడం ద్వారా పౌరాణిక మహానాయకులతో సరి సమానులమని చెప్పుకోవడం కనిపిస్తుంది. మరోవైపు ఈ ప్రాంతాన్ని శ్రీపర్వతప్రాంతం అన్నందున వీరిని శ్రీపర్వతీయులనీ, విజయపురి రాజధానిగా ఉన్నందున విజయపురి ఇక్ష్వాకులనీ కూడా పిలుస్తారు.
తెలంగాణ, దక్కనులలో చరిత్ర గతిని అర్థం చేసుంటే ఇక్ష్వాకులది స్థానిక తెగ అని, క్రమంగా శాతవాహనుల కాలంలో మహాతలవరలుగా ఎదిగారని అర్థం అవుతుంది. శాసనాల్లో వీరు తమను ‘ఇఖ్హాకులు’గా రాసుకున్నారు. దీని సంస్కృత రూపమే ఇక్ష్వాకు. ఇక్షువు అంటే చెరుకు. వీరి తెగ చిహ్నం చెరుకు అయి ఉండొచ్చని అందుకే ఇక్కాకులు అయినారనీ, అయితే పాలకులుగా మారేక్రమంలో తమ పాలనకు సాధికారతను చేకూర్చుకునేందుకు రాముడి వంశమైన ఇక్ష్వాకు వంశాన్ని ఎంచుకున్నారని భావించాలి. పైన చెప్పుకొన్న శాసనంలో రాముడే కాదు యుధిష్టురుడితో కూడా పోల్చుకున్నారు.
ఇక్ష్వాకుల కాలం నాటి ప్రత్యేకత
శాతవాహనుల కాలంలో మన తెలంగాణ చరిత్ర, సంస్కృతి పొద్దుపొడిస్తే ఇక్ష్వాకుల కాలంలో పరిణతిని సాధించింది. మొదట చెప్పుకోవాల్సింది ఆర్థికం. ఈ కాలంలో వ్యవసాయం, చేతివృత్తులు, వర్తకం అన్నీ విస్తరించినయి. ఇట్లా చెప్పుకోవడానికి పురాతత్వ విశేషాలే ఆధారం. ఇక రెండోది, వైదిక మత సంబంధమైన తొలి ఆలయాలు ఎన్నో కృష్ణా లోయలో జరిగిన తవ్వకాల్లో బయటపడ్డాయి. శాతవాహన కాలం నాటి ప్రాంతాలైన పెద్దబంకూరు, కంది వంటి ఊళ్ళల్లో జరిగిన తవ్వకాల్లో వైదిక ఆలయం వంటి నిర్మాణాలు బయటపడినా వాటి గురించి స్పష్టంగా చెప్పలేకపోయాం. కానీ వీరి కాలంలో నాగార్జునకొండ ప్రాంతంలో బయటపడ్డ ఆలయాలు దేశంలోనే తొలి వైదిక ఆలయాలుగా నిలుస్తాయి. ఎందుకంటే భారతదేశంలో పెద్ద ఎత్తున వైదిక ఆలయాల నిర్మాణం గుప్తుల కాలంలో జరుగగా.. అంతకు మునుపే కృష్ణా లోయ ప్రాంతంలో వైదిక ఆలయాల నిర్మాణం ఇక్ష్వాకుల పాలనలో జరిగింది. దీనర్థం వైదిక ఆలయాల వాస్తు శైలి ఇక్కడే రెక్క విప్పింది. ఏలేశ్వరంలో దొరికిన వైదిక ఆలయం, నాగార్జునకొండ పరిసర ప్రాంతాల్లోని వైదిక ఆలయాలు మన చరిత్రలో మొదటివి. వైదికమతంతోపాటే సంస్కృత భాష కూడా శాసనాల్లో రావటం మొదలైంది. శాతవాహన కాలపు థెరవాద బౌద్ధం ఇక్ష్వాకుల కాలానికి మహాయానంగా మారింది. నాడు బౌద్ధస్తూపాలు, విహారాలు ఎంతగా ఉన్నాయంటే ఇప్పటికీ తెలంగాణ నేల పొరల్లో బౌద్ధం పెద్ద ఎత్తున నిక్షిప్తమై ఉంది.
మూడోది వాస్తు. శిల్ప నిర్మాణంలో సాధించిన పరిపక్వత. గాంధార, మథుర శిల్ప కళారీతులకు దీటుగా అమరావతి శైలి శిల్పం ఇక్ష్వాకుల కాలంలో అద్భుతమైన పరిణతి సాధించింది. దానికి ఉదాహరణగా మన ఫణిగిరి శిల్పం నిలుస్తుంది.
నాలుగో ప్రత్యేకత అమరుల స్తూపాలు. ప్రతి గ్రామంలో కనిపించే వీరగల్లుల తొలి చారిత్రక రూపమైన ఛాయా స్తంభాల ఏర్పాటు వీరి కాలంలోనే జరిగింది.
శ్రీపర్వతానికీ శ్రీలంకకు సంబంధం
మన శ్రీపర్వతానికి సంబంధించిన మొదటి శాసన ఆధారం శ్రీలంకలోని కాండీ జిల్లాలో లైనమలైలో దొరికింది. సింహళ రాజైన కనిత్త తిస్స (పాలనాకాలం క్రీస్తు శకం 2-3) వేయించిన శాసనంలో సింహళ బౌద్ధులు కృష్ణాలోయలోని చూళ దమ్మగిరి అనే విహారంలో ఉండేవారని రాసి ఉంది. ఇక్కడి ఒక గ్రామం నుంచి వస్తున్న ఆదాయాన్ని శ్రీపర్వత విహారం కోసం కేటాయించినట్టుగా శ్రీలంకలోని శాసనం చెబుతుంది. శ్రీలంకలోని అనురాధపురలో జేఠవనంలో కూడా శ్రీపర్వతప్రాంతానికి శ్రీలంకకు ఉన్న సంబంధాల గురించి ఆధారాలు దొరికినయి. శాతవాహనుల కాలంలో రోమన్లతో సంబంధాలు అధికంగా ఉండగా, ఇక్ష్వాకుల కాలం నాటికి సింహళం మనకు దగ్గరైంది. దానికి కారణం ఇక్కడ విలసిల్లిన బౌద్ధమే.
వంశ- కాలక్రమణిక
మత్స్య, వాయు పురాణాలు ఇక్ష్వాకు వంశంలో ఏడు మంది రాజులు నూరేండ్లు పాలించారని చెప్తాయి. పురాణాల్ని గుప్తుల చివరి వరకు అంటే సుమారు ఇంకో 200 ఏళ్ళ వరకు రాయటం జరిగినందున పురాణాలలో తప్పుగా రికార్డు అయి ఉంటుందని చరిత్రకారుల భావన. ఎందుకంటే మనకు దొరికిన పురావస్తు ఆధారాల్లో కేవలం నలుగురు రాజుల పేర్లు, ఒక రాకుమారుడి పేరు, సుమారు 80 ఏళ్ళు పాలించినట్టుగా వివరాలు లభించాయి. ఈ ఆధారాల ప్రకారం-
మొదటి రాజు పేరు వాసిష్టీపుత్ర శ్రీ చాంతమూల. క్రీస్తుశకం 225లో స్వతంత్ర ఇక్ష్వాకు రాజుగా ఇతని పాలన మొదలైంది. ఆ తర్వాత వరుసగా మాథరీపుత్ర శ్రీ వీరపురుషదత్త, వాసిష్టీపుత్ర శ్రీ ఎహువల చాంతమూల చివరగా రుద్రపురుషదత్త రాజ్యమేలినారు. ఇప్పటికీ వీళ్ళ పాలనాకాలంపై చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలున్నప్పటికీ చివరి రాజైన రుద్రపురుషదత్త 18 ఏళ్ళు పాలించినట్టు ఫణిగిరిలో దొరికిన శాసనం రూఢీ చేస్తుంది. సుమారు క్రీస్తు శకం 225లో మొదలైన ఇక్షాకుల ఏలుబడి రాజులుగా మారే క్రమంలో క్రీస్తు శకం 300 వరకు కొనసాగింది. వీరి పేర్లలో గమనించాల్సిన అంశం తల్లి పేరు తమ పేరుకు ముందు చేర్చుకోవడం. ఇది శాతవాహన కాలం నుంచి వస్తున్న సంప్రదాయమే. దీనిని matronymic tradition అని అంటారు. ఇది నాటి కాలంలో తల్లికి ఇచ్చిన ప్రత్యేక స్థానంగా చెప్పుకోవచ్చు.