ఇది 21వ శతాబ్దమని, ఈ కాలంలో ఇంకా బలప్రయోగంతో ఒక జాతి ఆకాంక్షను అదిమిపెట్టటం, వారి గొంతుకను ఉక్కుపాదంతో అణచివేయటం సాధ్యం కాదని చైనా నేటికీ గుర్తించినట్టు లేదు. టిబెట్ను తమ పెరటిస్థలంగానే ఇప్పటికీ భావిస్తున్నట్టున్నది. ఇటీవల ఢిల్లీలో మన ఎంపీల బృందానికి టిబెట్ ప్రవాస పార్లమెంటు విందు ఇవ్వటంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయటం దీనికి అద్దం పడుతున్నది. ఇట్లా విందు ఇవ్వటం దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం. దీని పట్ల చైనా గుర్రుగా ఉన్నదంటే ఆ దేశ అహంకారం ఏ స్థాయికి చేరుకున్నదో అంచనా వేయవచ్చు. జిన్పింగ్ అధ్యక్షుడై చైనా మీద పూర్తిస్థాయి పట్టు బిగించిన తర్వాత ఆ దేశం వైఖరి గతంలోకన్నా కఠినంగా తయారైంది. సరిహద్దుల్లో భారత్తో గిచ్చికయ్యం పెట్టుకుంటున్న చైనా ఇప్పుడు సంప్రదాయంగా జరిగే విందుపై కూడా రాద్ధాంతం చేస్తున్నది.
టిబెట్ గోసకు 70 ఏండ్ల చరిత్ర ఉంది. 1949లో చైనాలో మావోజెడాంగ్ నాయకత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడేనాటికి టిబెట్ స్వతంత్ర రాజ్యంగా కొనసాగుతున్నది. చైనాతో పోల్చితే వారి భాష, సంస్కృతి, మతం, ఆచార వ్యవహారాలు అన్నీ భిన్నమైనవే. 1951లో వారి మీద బలవంతపు ఒప్పందాన్ని రుద్దిన చైనా ఆ ప్రాంతంలోకి చైనీయుల వలసలను ప్రోత్సహిస్తూ, తమ సంస్కృతిని ప్రవేశపెట్టటానికి పూనుకున్నది. దీనిని వ్యతిరేకించిన టిబెట్ వాసులపై నిర్బంధకాండను అమలుపరిచింది. 1959లో టిబెట్ ప్రజలు జరిపిన సాయుధ తిరుగుబాటును రక్తపుటేర్లలో ముంచింది. దలైలామా తదితర టిబెట్ నేతలు, కొందరు ప్రజలు భారత్కు వచ్చి నాటి నుంచి ఇక్కడే తలదాచుకుంటున్నారు. ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని తమ మాతృభూమి విముక్తి కోసం శాంతియుత పద్ధతుల్లో కృషి చేస్తున్నారు. వాళ్లు ఇప్పటికీ చైనాను అడుగుతున్నది ఒక్కటే- తమతో చర్చలు జరపమని. దానికి కూడా చైనా ససేమిరా అంటున్నది.
మైనారిటీల సమస్యలపై ఐక్యరాజ్యసమితి ఫోరం గత నెలలో సమావేశమైనప్పుడు టిబెటన్ ప్రతినిధి బృందం తమ మాతృభూమిపై చైనా సాగిస్తున్న అకృత్యాలను వెల్లడించింది. మాతృభాషలో చదువుకోవటానికి అనుమతించకపోవటం, నిర్బంధ శిబిరాలు పెట్టి చైనా సంస్కృతిని రుద్దటం, యువతీయువకుల చేత బానిస చాకిరీ చేయించడం వంటి దారుణాలు టిబెట్లో సాగుతున్నాయి. టిబెట్ బౌద్ధ మతాధిపతి దలైలామా వయస్సు పెరుగుతుండటంతో ఆయన వారసుడి ఎంపిక అంశంలోనూ చైనా జోక్యం చేసుకుంటున్నది. టిబెటన్లకు దలైలామా రూపంలో ఒక స్వతంత్ర ఆధ్యాత్మిక నాయకత్వం ఉండకుండా చూడాలన్నది డ్రాగన్ దురుద్దేశం. చైనా ఆధిపత్యాన్ని భరించలేక వందలాది మంది టిబెటన్లు బలిదానాలకు పాల్పడటం వారి దయనీయ పరిస్థితిని తెలుపుతున్నది. భవిష్యత్తులో ఈ వివాదం మరింత సంక్లిష్టంగా మారవచ్చు. చైనా నుంచి ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ, టిబెటన్లకు భారత్ సంఘీభావాన్ని కొనసాగించాలి. చైనా ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడుతున్న టిబెటన్లకు, వీగర్లకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు కూడగట్టాలి.