DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) గా పగ్గాలు చేపట్టబోతున్న డీకే శివకుమార్ (DK Shivakumar) తన క్యాబినెట్లో నలుగురు ఉప ముఖ్యమంత్రుల ప్రతిపాదనకు నో చెప్పారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ విషయంలో తన నిర్ణయాన్ని ఆయన అధిష్ఠానానికి తెలియజేశారు. కర్ణాటక కాంగ్రెస్ (Karnataka Congress) లో చాలామంది సీనియర్లు ఉన్నందున కొందరిని మాత్రమే ఉపముఖ్యమంత్రులుగా ఎంపిక చేయడంవల్ల పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి తలెత్తవచ్చని పార్టీకి ఆయన వివరించినట్టు తెలుస్తోంది.
సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్కు సీఎం పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకోవడంతో కర్ణాటకలో అధికార పంపకాలకు సంబంధించిన ఒప్పందంపై చాలాకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరపడింది. జూన్ 3న డీకే శివకుమార్ కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటు, పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంపై సీనియర్ నేతలతో పార్టీ అధిష్ఠానం సంప్రదింపులు సాగిస్తోంది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా శివకుమార్ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు.
కాగా జూన్ 3న డీకే శివకుమార్తోపాటు కొద్దిమంది మాత్రమే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది. రాష్ట్ర నాయకత్వం, కాంగ్రెస్ అధిష్ఠానం మధ్య సంప్రదింపుల అనంతరమే తదుపరి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సమాచారం. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 32 మందిని మంత్రివర్గంలోకి తీసుకునే వీలు ఉంటుంది. మంత్రివర్గం కూర్పుపై చర్చలను కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటికే ముమ్మరం చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పలువురు సీనియర్ మంత్రులను క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఆ సీనియర్లలో ఎంబీ పటేల్, జి పరమేశ్వర, కేజీ జార్జి, ప్రియాంక్ ఖర్గే, యతీంద్ర సిద్ధరామయ్య, కేబీ గౌడ, లక్ష్మీ హెబ్బాల్కర్, బి సురేష్, సంతోష్ లాడ్ పేర్లు ఉన్నాయి. అసెంబ్లీ స్పీకర్ పదవికి రేసులో సీనియర్ మంత్రులు హెచ్ఎం మునియప్ప, హెచ్కే పటేల్ ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం, శివకుమార్, సిద్ధరామయ్య మధ్య సంప్రదింపుల ఆధారంగానే మంత్రివర్గం తుది కూర్పు ఉంటుందని చెబుతున్నారు.