‘క్రిప్టోకరెన్సీలకు విలువే లేదు. ఒక్క తులిప్ విలువ కూడా చేయవు. మదుపరులు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఇలా హెచ్చరించడం నా కర్తవ్యం. క్రిప్టో పెట్టుబడులపై వచ్చే లాభనష్టాలకు మదుపరులదే పూర్తి బాధ్యత. ఎందుకంటే క్రిప్టోల నియంత్రణకు స్పష్టమైన వ్యవస్థలేవీ లేవు’
-శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్
ముంబై, ఫిబ్రవరి 10: క్రిప్టోకరెన్సీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ మరోసారి హెచ్చరించారు. ఆర్థిక స్థిరత్వానికి ఇవి ముప్పేనన్నారు. ఈ క్రమంలోనే కనీసం ఒక్క తులిప్ పువ్వు విలువ కూడా చేయవంటూ ‘తులిప్ మానియా’తో పోల్చి క్రిప్టో బూమ్ను కొట్టిపారేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి (2021-22)గాను చివరి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఫలితాలను గురువారం దాస్ వెల్లడించారు. ఈ సందర్భంగానే క్రిప్టోకరెన్సీలపట్ల మదుపరులు జాగ్రత్తగా ఉండాలని, సొంత పూచీకత్తుపైనే పెట్టుబడులు పెట్టుకోవాల్సి ఉంటుందని, నియంత్రణ లేని ఈ తరహా మదుపు ప్రమాదమని హితవు పలికారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను ఈ నెల 1న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్లో క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ద్వారా పొందిన ఆదాయంపై గరిష్ఠంగా 30 శాతం పన్నును మోదీ సర్కారు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ స్థూల ఆర్థిక వ్యవస్థకు, ఆర్థిక స్థిరత్వానికి క్రిప్టోలతో ముప్పేనని దాస్ వ్యాఖ్యానించారు. ‘ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలనో లేక ఇంకే పేరుతోనైనా మీరు పిలుస్తున్నాసరే.. వాటితో మన స్థూల ఆర్థిక వ్యవస్థకు, ఆర్థిక స్థిరత్వానికి ముప్పే. ఎందుకంటే ఆర్థిక సుస్థిరత, స్థూల ఆర్థిక వ్యవస్థ రక్షణకు ఆర్బీఐ తీసుకునే చర్యలను ఇవి దెబ్బతీస్తాయి’ అని ద్రవ్యసమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడుతూ దాస్ అన్నారు. నిజానికి క్రిప్టోకరెన్సీలు ప్రమాదకరమని ఆర్బీఐ గవర్నర్ దాస్ ఎప్పట్నుంచో చెప్తున్నారు. బ్యాంకులు ఈ లావాదేవీలకు దూరంగా ఉండాలని ఆదేశించారు కూడా. అయితే 2020లో సుప్రీంకోర్టు జోక్యంతో ఈ ఆదేశాలు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే బడ్జెట్లో క్రిప్టో పన్ను ప్రతిపాదన రాగా, క్రిప్టో ట్రేడర్లు ఇలాగైనా చట్టపరమైన గుర్తింపు వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు దాస్ మరోమారు క్రిప్టోకరెన్సీలపై తమ ఆందోళనల్ని బయటపెట్టడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.
2020 ఆగస్టు నుంచి..
కరోనా దెబ్బకు కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి 2020 ఆగస్టు నుంచి ప్రతీ ద్వైమాసిక ద్రవ్యసమీక్షలోనూ కీలక వడ్డీరేట్ల పెంపు జోలికే ఆర్బీఐ వెళ్లలేదు. తాజా ద్రవ్యసమీక్షలోనూ ఆరుగురు సభ్యులున్న ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ.. 5-1 నిష్పత్తిలో రెపో, రివర్స్ రెపోలను యథాతథంగానే ఉంచాలని నిర్ణయించింది. దీంతో పదోసారి ఎక్కడివక్కడే ఉన్నైట్టెంది. కాగా, బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు మూలధన నిల్వలను పటిష్ఠంగా ఉంచుకోవాలని, భవిష్యత్తు అనిశ్చితులను అప్పుడే సమర్థవంతంగా ఎదుర్కోగలరని దాస్ అన్నారు.
ఈ-రుపీ వోచర్ల పరిమితి పెంపు
ఈ-రుపీ ప్రీపెయిడ్ డిజిటల్ వోచర్లపై పరిమితిని రూ.10వేల నుంచి లక్ష రూపాయలకు ఆర్బీఐ పెంచింది. అంతేగాక గతంలో ఒక్కసారి మాత్రమే ఉన్న వీటి వినియోగాన్నీ ఇప్పుడు పెంచారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) రూపొందించిన ఈ-రుపీ వోచర్లను గతేడాది ఆగస్టులో ప్రారంభించిన విషయం తెలిసిందే. లబ్ధిదారులకు వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాన్ని డిజిటల్ రూపంలో అందించాలనే ఉద్దేశంతో వీటిని పరిచయం చేశారు. అయితే రూ.10వేల పరిమితితో తెచ్చిన ఈ-రుపీ వోచర్ల మొత్తాన్ని ఇప్పటిదాకా లబ్ధిదారులు ఒక్కసారే తీసుకోవాల్సి వస్తున్నది. ఇప్పుడు ఈ పరిమితిని లక్ష రూపాయలకు పెంచగా, వోచర్లోని ఈ మొత్తం అయిపోయేదాకా ఎన్నిసాైర్లెనా వాడుకోవడానికి (రిడీమ్) వెసులుబాటు కల్పించారు.
ఆర్బీఐకి సీబీడీసీ ఇష్టం లేదా?
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) లేదా డిజిటల్ రుపీ పరిచయానికి తొందరేం లేదని ఆర్బీఐ బాస్ దాస్ అన్నారు. సీబీడీసీ విడుదలకు ముందు అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని చెప్పారు. నిజానికి బడ్జెట్లో వచ్చే ఆర్థిక సంవత్సరం డిజిటల్ రుపీని ఆర్బీఐ తీసుకురాబోతున్నదని కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎప్పట్లోగా సీబీడీసీ వస్తుందన్న ప్రశ్నకు దాస్ సమాధానాన్ని కొట్టిపారేయడం గమనార్హం. దీంతో ఆర్బీఐకి సీబీడీసీ ఇష్టం లేదా? కేంద్రం బలవంతంతోనే తెస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్రిప్టోకరెన్సీలపై ముందునుంచే దాస్ విముఖత చూపుతుండటం, ఆ క్రిప్టోలు నడుస్తున్న బ్లాక్చైన్ టెక్నాలజీ ఆధారంగానే రాబోయే డిజిటల్ రుపీ కూడా చెల్లుబాటు కావడం మధ్య డిజిటల్ రుపీని హడావుడిగా తెచ్చే అవకాశాల్లేవని దాస్ చేసిన తాజా వ్యాఖ్యలకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. మొత్తానికి పాత పెద్ద నోట్ల రద్దుతో డిజిటలైజేషన్ను తలకెత్తుకున్న మోదీ సర్కారు.. క్రిప్టో పన్ను, డిజిటల్ రుపీలతో దేశ ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి గతి పట్టిస్తుందోనన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.
ద్రవ్యసమీక్ష ముఖ్యాంశాలు
‘వృద్ధిరేటు బలోపేతానికి మరోసారి ఆర్బీఐ ప్రాధాన్యాన్ని ఇచ్చింది. మార్కెట్ సెంటిమెంట్లకు
ఈ పాలసీ గొప్ప మద్దతును అందించింది’
-దినేశ్ ఖారా, ఎస్బీఐ చైర్మన్
‘నిలకడైన వృద్ధిరేటుకు ఈ తరహా పాలసీ అవసరం. ఆర్బీఐ సూచించినట్టుగా మూలధన నిల్వలను బ్యాంకులు పెంచుకోవాలి’
-అతుల్ కుమార్ గోయల్, ఐబీఏ చైర్మన్
‘తక్కువ వడ్డీరేట్లు, వ్యవస్థలో అపరిమితమైన ద్రవ్య లభ్యత ఆందోళనకరం. దీనివల్ల ఆర్థిక స్థిరత్వానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి’
-దువ్వూరి సుబ్బారావు ,ఆర్బీఐ మాజీ గవర్నర్