హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా ఉన్నది ఆయిల్ఫెడ్లోని ఓ అధికారి తీరు. ఉద్యోగ విరమణ పొంది కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్న సదరు అధికారి మొత్తం అధికారాల కోసం పట్టుపడుతుండడం గమనార్హం. రెగ్యులర్ అధికారి మాదిరిగానే ఇప్పుడు కూడా అన్ని అధికారాలను ఇవ్వాలంటూ పట్టుపడుతున్నారు. ఇందుకు సంబంధించి ఆయిల్ఫెడ్ ఉన్నతాధికారులకు మొరపెట్టుకోగా వారు నిరాకరించడంతో ఏకంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వద్దకే వెళ్లారు. తనకు అధికారాలు కల్పించాలంటూ మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. దీంతో అధికారి తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆయిల్ఫెడ్లో జనరల్ మేనేజర్గా విధులు నిర్వర్తించిన సుధాకర్రెడ్డి మార్చి నెలలో ఉద్యోగ విరమణ పొందారు. మళ్లీ నియామకం కోసం తీవ్రంగా పైరవీలు చేసినట్టు తెలిసింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆమోదం తెలుపగా ఆరు నెలలపాటు కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తూ మార్చిలో ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 30వ తేదీతో ఈ గడువు కూడా ముగియనున్నది. మరో నెల మాత్రమే ఆయనకు గడువు మిగిలి ఉన్నది. ఆయనను కాంట్రాక్టు పద్ధతిలో నియమించడంతో ఆర్థికపరమైన అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారం ఇవ్వలేదు. దీనిపై ఆ అధికారి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇతర శాఖల్లో ఇస్తున్నప్పుడు తనకు ఎందుకు ఇవ్వడంలేదంటూ ఉన్నతాధికారులతో వాదిస్తూనే ఉన్నారు.
అయినప్పటికీ ఆయనకు అధికారాలు ఇచ్చేందుకు ఉన్నతాధికారులు ససేమిరా అన్నారు. కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతుండడంతో ఒకవేళ అవకతవకలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని అధికారులు ప్రశ్నిస్తున్నారు. అందుకనే ఆయనకు ఆర్థికపరమైన అధికారాలు ఇవ్వడంలేదని చెప్తున్నారు. అయినప్పటికీ ఆ అధికారి మాత్రం తన ప్రయత్నాలు ఆపకపోవడం గమనార్హం. గడువు ముగుస్తున్నా.. అధికారాల కోసం ఇంతలా పట్టుపడుతుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే మరోసారి గడువు పొడగించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. మొదటిసారి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా తన సేవల్ని గుర్తించి, తన అవసరం ఉందని గ్రహించి పిలిచి పట్టుబట్టి మరీ అవకాశం ఇచ్చారని, ఇప్పుడు కూడా అదే జరుగుతుందని చెబుతున్నట్టుగా తెలిసింది.