న్యూఢిల్లీ: బీజేపీ పాలిత ఢిల్లీలో మరో ‘నిర్భయ’ తరహా ఘటన చోటుచేసుకుంది. రాత్రి వేళ సరిగ్గా తెలియక మరో బస్స్టాప్లో దిగి, భారీ వర్షంలో చిక్కుకుపోయిన యూపీకి చెందిన బాలిక(16) అత్యాచారానికి గురైంది. లిఫ్ట్ కోసం స్లీపర్ బస్సు ఎక్కిన ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని పోలీసులు తెలిపారు. ఆమె బస్సు ఎక్కిన తర్వాత దాదాపు 47 కిలోమీటర్ల ప్రయాణించాక ఆ బస్సు ఆమెను కశ్మీర్ గేట్ సమీపంలో వదిలివెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఈ ఘటన ఆగస్టు 4న రాత్రి జరిగింది. మెయిన్పురి జిల్లాకు చెందిన ఆ బాలిక తన కుటుంబంతో మనస్పర్థలు రావడంతో ఇంటి నుంచి నోయిడాలోని తన బంధువును కలిసేందుకు బయలుదేరింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భారీ వర్షం, చీకటిలో బాలిక పొరపాటున పరి చౌక్ బస్స్టాప్ వద్ద దిగింది. ఆమె సహాయం కోసం సైగ చేయడంతో ఆ ప్రాంతం గుండా వెళ్తున్న ఒక ఖాళీ స్లీపర్ బస్సు ఆగింది. డ్రైవర్ కులదీప్, కండక్టర్ సందీప్ ఈ బస్సు నోయిడా సెక్టర్ 63 వైపు వెళుతోందని చెప్పి, ఆమెను బస్సు ఎక్కించుకున్నారు. బస్సు కదలగానే కండక్టర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడని పోలీసులు తెలిపారు.
అనంతరం డ్రైవర్, కండక్టర్ ఇద్దరూ తనపై అత్యాచారం చేశారని, తాను ఎదిరించగా చంపేస్తామని బెదిరించారని ఆ బాలిక ఆరోపించింది. స్లీపర్ బస్సులోని బెర్త్ల చుట్టూ కర్టెన్లు ఉన్నాయని, ప్రయాణ సమయంలో లోపల ఎం జరుగుతున్నదో బయటకు కనిపించకుండా దాచడానికి ఇది సహాయపడిందని పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి వేళ కశ్మీరీ గేట్ బస్ టెర్మినల్ సమీపంలోని రింగ్ రోడ్డుపై బాలికను వదిలేసి నిందితులు పరారయ్యారు. తీవ్ర భయాందోళనలకు గురైన బాలిక కశ్మీర్ గేట్ పోలీసులను ఆశ్రయించి ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, స్లీపర్ బస్సును స్వాధీనం చేసుకున్నారు.
మూడేండ్ల చిన్నారిపై లైంగిక దాడి
ఢిల్లీలో ఓ ప్రైవేటు బడిలో నర్సరీ చదువుతున్న మూడేండ్ల చిన్నారిపై అదే పాఠశాల డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. చిన్నారికి చాక్లెట్లు ఇస్తూ మచ్చిక చేసుకుని అతడు ఈ దురాగతానికి పాల్పడ్డాడు. ఆగస్టు 19న రాత్రి చిన్నారి శరీరంపై గాయాల గుర్తులను గమనించిన తల్లిదండ్రులు ప్రశ్నించగా చిన్నారి నిందితుడి గురించి చెప్పింది.