హైదరాబాద్, జనవరి 25: చిప్ డెవలప్మెంట్కు హైదరాబాద్ వేదిక కానున్నది. అమెరికాకు చెందిన సెరిమోర్ఫిక్ సంస్థ.. భాగ్యనగరంలో తమ తొలి డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసింది. 35 వేలకుపైగా చదరపు అడుగుల్లో నిర్మించిన ఈ సెంటర్లో ఐఐటీ హైదరాబాద్ సహకారంతో చిప్ డెవలప్మెంట్కు కంపెనీ కృషి చేయనున్నది. ఓ సూపర్కంప్యూటింగ్ చిప్ తయారీ దిశగా సెరిమోర్ఫిక్ వెళ్తున్నట్టు సంస్థ యాజమాన్యం ఈ సందర్భంగా తెలిపింది. టీఎస్ఎంసీ 5ఎన్ఎం నాడ్లో అత్యంత విశ్వసనీయత, శక్తి సామర్థ్యంతో దీన్ని రూపొందించనున్నామన్న సంస్థ.. 2024కల్లా ఈ చిప్ను మార్కెట్లో అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టు చెప్పింది. దీంతో మరో గ్లోబల్ సెమీకండక్టర్ హబ్గా మారబోతున్న భారత్కు హైదరాబాదే కేంద్రం కాగలదన్న అంచనాలు ఊపందుకున్నైట్టెంది. గతకొద్ది నెలలుగా దేశంలో వివిధ రంగాలను చిప్ల కొరత వేధిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆటో, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థలను సెమీకండక్టర్ల లేమి తీవ్రంగా నష్టపరుస్తున్నది. ఈ నేపథ్యంలో సెరిమోర్ఫిక్ హైదరాబాద్ సెంటర్ ద్వారా చిప్ డెవలప్మెంట్పై దృష్టి పెట్టడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.
టెక్నాలజీకి కొత్త ఊపు
బలమైన ఐపీ పోర్ట్ఫోలియోను కలిగి ఉన్న సెరిమోర్ఫిక్.. హైదరాబాద్లో డెవలప్మెంట్ సెంటర్ను తీసుకురావడంతో ఇక్కడి టెక్నాలజీకి కొత్త ఊపు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ సంస్థకు 100కుపైగా పేటెంట్లున్నాయి. అంతేగాక సిలికాన్ సిస్టమ్స్లో దశాబ్దాల అనుభవం సొంతం. ఈ క్రమంలోనే కృత్రిమ మేధస్సు (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), హై పవర్ కంప్యూటింగ్ (హెచ్పీసీ), ఆటోమోటివ్ ప్రాసెసింగ్, డ్రగ్ డిస్కవరీ, డాటా సెంటర్, మెటావర్స్ ప్రాసెసింగ్ వంటి తర్వాతి తరం అప్లికేషన్ల సమగ్ర అభివృద్ధికి హైదరాబాద్ కేంద్రంగా పనిచేయాలని చూస్తున్నది. ‘భారీ స్థాయిలో డాటా నిర్వహణకు సూపర్కంప్యూటింగ్ చిప్లు అత్యంత ప్రధానం. కన్వెన్షనల్ చిప్లు ఇందుకు సరిపోవు. అందుకే ఏఐ, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సామర్థ్యాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. సెమీకండక్టర్ టెక్నాలజీ సంబంధిత అభివృద్ధి చర్యల్లో రాష్ర్టానికి వెంకట్, ఆయన బృందం దన్నుగా నిలిచారు. ఇక్కడ వీఎల్ఎస్ఐ ఎకోసిస్టమ్ బలోపేతానికీ సెరిమోర్ఫిక్ దోహదం చేయనుంది’ అని ఈ సందర్భంగా తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు.
మరిన్ని ఉద్యోగాలు
ప్రస్తుతం హైదరాబాద్ సెరిమోర్ఫిక్ డెవలప్మెంట్ సెంటర్లో 140 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2024 ఆఖరుకల్లా ఇక్కడి సిబ్బందిని 400లకు పెంచాలని సంస్థ యోచిస్తున్నది. ఇక ఈ డెవలప్మెంట్ సెంటర్లో ఏటా రూ.70 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టాలని కంపెనీ భావిస్తున్నది. వచ్చే రెండేండ్లకుపైగా కాలంలో చిప్ అభివృద్ధి కోసం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని కూడా సెరిమోర్ఫిక్ చూస్తున్నది. 2020 ఏప్రిల్లో డాక్టర్ వెంకట్ మట్టెల సెరిమోర్ఫిక్ను స్థాపించారు. ఈయన రెడ్పైన్ సిగ్నల్స్ వ్యవస్థాపక సీఈవోగా కూడా ఉన్నారు. 308 మిలియన్ డాలర్లకు 2020 మార్చిలో ఈ సంస్థ తమ వైర్లెస్ ఆస్తులను సిలికాన్ ల్యాబ్కు అమ్మేసింది.
‘విదేశీ విస్తరణపై సంస్థ దృష్టి పెట్టింది. అందుకే అంతర్జాతీయ కార్యకలాపాల కోసం రూ.350 కోట్లకుపైగా పెట్టుబడులను పెడుతున్నాం. మా లక్ష్య సాధనకు భారతీయ ఐఐటీల సహకారాన్నీ తీసుకుంటాం. ఇందులో భాగంగానే గణిత, ఆల్గరిథమ్ అంశాల్లో ఐఐటీ హైదరాబాద్తో కలిసి పనిచేసే దిశగా వెళ్తున్నాం. చిప్ రిసెర్చ్, డెవలప్మెంట్లో ఇది మా సంస్థకు ఎంతగానో కలిసొస్తుంది. హైదరాబాద్లోని మా సిబ్బందిలో 35 శాతం మంది ఐఐటీ వాళ్లే. భవిష్యత్తులో మరెన్నో నూతన ఆవిష్కరణలకూ ఆస్కారమున్నది’
-వెంకట్ మట్టెల,సెరిమోర్ఫిక్ వ్యవస్థాపక సీఈవో