Gold medalist Suicide | 50 సార్లు ప్రయత్నిచినా ఉద్యోగం రాలేదని బీటెక్లో గోల్ట్మెడల్ సాధించిన 23 ఏండ్ల ఆనంద్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, కాన్పూర్లోని గోవింద్ నగర్లో మూడంతస్తుల ఇంట్లో ఆనంద్ కుమార్ కుటుంబం నివాసం ఉంటుంది. కుటుంబ సభ్యులు తమ పెద్ద కుమారుడి పెళ్లి ఖరారు చేసుకునేందుకు బిహార్లోని తమ సొంతూరుకు వెళ్లారు.
పనిమనిషి వచ్చి ఎంతసేపు తలుపు కొట్టినా తీయకపోవడంతో ఆమె చుట్టుపక్కల వారికి, పోలీసులకు విషయం తెలిపింది. వారు వచ్చి తలుపు తీయగా ఆనంద్ కుమార్ ఉరికి వేళ్లాడుతూ కనిపించాడు. ‘క్షమించండి నాన్న, నేను ప్రభుత్వ ఉద్యోగం కోసం దాదాపు 50 సార్లు ప్రయత్నించాను. కానీ సఫలం కాలేకపోయాను. దయచేసి నన్ను క్షమించండి’. అని అతడు రాసిన లేఖను పోలీసులు గుర్తించారు.
బీటెక్ అనంతరం పవర్ గ్రిడ్లో ఒక సంవత్సరం అప్రెంటిస్ పూర్తి చేశాడని, ఎన్నో సార్లు ప్రయత్నించినా ప్రభుత్వ ఉద్యోగం రాలేదనే ఒత్తిడితో ఇలా చేసుకుని ఉంటాడని తండ్రి రాజ్కుమార్ (సివిల్ ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ రిటైర్డ్ ఉద్యోగి) తెలుపుతూ కన్నీటి పర్యంతమయ్యారు. రైల్వేలు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC), బ్యాంకులు, విద్యాశాఖ నిర్వహించిన దాదాపు యాభై పరీక్షలు రాశాడు. దేంట్లోనూ విజయం సాధించలేకపోయాడు. ఈ విషయంలో కొన్ని నెలలుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు.
ఆనంద్ కుమార్ కాన్పూర్లోని ప్రణ్వీర్ సింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (PSIT)లో బీటెక్ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) పూర్తి చేశాడు. కాలేజీ టాపర్గా, రాష్ట్రంలో మూడో ర్యాంకులో పాస్ అయ్యాడు. కాలేజీ టాపర్గా గవర్నర్ ఆనందీబెన్ పటేల్ చేతుల మీదుగా గోల్డ్మెడల్ కూడా అందుకున్నాడు.