విదేశీయులు మన సినిమాలను చూసి ప్రశంసించాలి..భారతీయులు ఇలాంటి చిత్రాలు రూపొందించగలరా అనుకోవాలి అంటున్నారు బాలీవుడ్ అగ్ర నటుడు జాన్ అబ్రహాం. ఆయన నటిస్తున్న కొత్త సినిమా ‘అటాక్’. లక్ష్యరాజ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. రకుల్ ప్రీత్సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నాయికలుగా నటించారు. ఉగ్రవాదంపై పోరాడేందుకు శాస్త్రవేత్తలు రోబో సైనికుడిని రూపొందించేందుకు ప్రయత్నిస్తారు. ఈ ప్రయోగాల్లో భాగమైన ఓ యువకుడి కథే అటాక్. ఈ చిత్ర ట్రైలర్ విడుదల సందర్భంగా జాన్ అబ్రహాం మాట్లాడుతూ…‘మనం ‘అవేంజర్స్’ లాంటి హాలీవుడ్ సూపర్ హీరో చిత్రాలు చూస్తుంటాం. మనమూ అలాంటి సినిమాలను తెరకెక్కించవచ్చు. ‘అటాక్’ అలాంటి ప్రయత్నమే. మన చిత్రాలు చూసి విదేశీయులు అబ్బురపడాలి. చెడ్డ చిత్రానికి ఎంత ప్రచారం చేసినా ఫలితం ఉండదు. నా కెరీర్లోనూ ఇది అనుభవమే. కానీ ఇది మంచి సినిమా అని చెప్పగలను’ అన్నారు. ఏప్రిల్ 1న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది.