న్యూఢిల్లీ : తూర్పు లడఖ్లోని వాస్తవాధీన రేఖ వెంట నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు చైనాతో భారత్ సైనిక చర్చలు వచ్చే వారం జరుగుతాయని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 12 రౌండ్ల పాటు చర్చలు జరగ్గా.. 13వ రౌండ్ సైనిక చర్చల సన్నాహాల్లో భాగంగా ఇరువైపులా నోట్స్ను మార్చుకున్నట్లు అధికారులు తెలిపారు. హాట్ స్ప్రింగ్స్, పలు ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణపై వచ్చే కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల్లో చర్చకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నట్లు సైనిక వర్గాలు పేర్కొన్నాయి. చర్చలు జరిగే తేదీలు, వేదికపై వచ్చే మూడు, నాలుగు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పాయి. అయితే, అక్టోబర్ రెండోవారంలో చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.