చండీగఢ్ : హర్యానా డిప్యూటీ స్పీకర్, బీజేపీ నేత రణబీర్ గంగ్వా వాహనంపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వంద మంది రైతులపై పోలీసులు దేశద్రోహం అభియోగాలు మోపారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన జరుగుతున్న సందర్భంలో ఈ నెల 11న హర్యానాలోని సిర్సా జిల్లాలో చోటు చేసుకుంది. అదే రోజు రైతులపై దేశద్రోహంతో పాటు హత్యాయత్నం కింద అభియోగాలు మోపి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రైతు ఉద్యమానికి చెందిన ఇద్దరు నాయకులు హర్చరన్ సింగ్, ప్రహ్లాద్ సింగ్ పేర్లు ఎఫ్ఐఆర్ ఉన్నాయి. కేసుల నమోదును సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం తీవ్రంగా ఖండించింది. అయితే, గురువారం సెక్షన్ 124-ఎ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘సెక్షన్ పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని.. కొయ్యను మలిచే రంపం ఇస్తే అడవిని నాశనం చేసినట్లుంది’ అని వ్యాఖ్యానించిన కొద్ది గంటల్లోనే రైతులపై దేశద్రోహ ఆరోపణలు వెలుగులోకి రావడం గమనార్హం.