పదవుల్లో ఉన్నా, లేకున్నా పేదలకు ఆపన్నహస్తం
వైద్యసేవల్లో సాయం.. కష్టాల్లో అభయం
గల్ఫ్ బాధిత కుటుంబాల కన్నీరు తుడుస్తున్న కవిత
రాష్ట్ర సాధనలో సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపిన లీడర్
ఆమె కృషితో అంతర్జాతీయ వేదికలపై బతుకమ్మ వైభవం
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రగతిలో తనదైన ముద్ర
నేడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం
నిజామాబాద్, మార్చి 12, (నమస్తే తెలంగాణ ప్రతినిధి):అన్నార్తులకు ఆమె అన్నపూర్ణ. ఆపదలో ఉన్నవారికి కొండంత అండ. పేదింటికి కష్టంలో పెద్దదిక్కు. ఆడపిల్లకు ఆమె ఓ ఆత్మవిశ్వాసం.. పండుగకు తోబుట్టువు.. ప్రజలకు పెన్నిధి.. ఇందూరు బతుకమ్మ కల్వకుంట్ల కవిత. ప్రజలతో మమేకమైన నేతగానే కాకుండా మానవతకు మారుపేరుగా నిలుస్తున్నారామె. ఎంపీగా చేసినా, ఎమ్మెల్సీగా కొనసాగుతున్నా.. నిరంతరం జిల్లా ప్రజలవెంట ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకపాత్ర పోషించడంతోపాటు సాంస్కృతిక ఉద్యమానికి సారథ్యం వహించారు. బతుకమ్మకు విశ్వఖ్యాతి తీసుకువచ్చారు. సామాజికాంశాలపై యువతను జాగృతం చేస్తున్నారు. నేడు కవిత జన్మదినం సందర్భంగా ఘనంగా వేడుకలను నిర్వహించేందుకు అభిమానులు, స్వచ్ఛందసంస్థలు, రాజకీయపక్షాలు సిద్ధమవుతున్నాయి.
ఆకలిగా ఉన్నవారికి గుప్పెడు అన్నం… ఆపదలో ఉన్నవారికి కొంచెం సాయం… బాధలో ఉన్నవారికి ఓదార్పు… ఏ దిక్కూ లేని వారికి దిక్సూచిగా నిలవడమే నిజమైన మానవత్వం. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే పక్క వారికి సాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒకరు. కష్టం ఉందని ట్వీట్ చేసినా… సాయం చేయాలంటూ అర్జీ పెట్టుకున్నా వెంటనే స్పందించే గుణం ఆమె సొంతం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి జైలుకెళ్లిన ధీర త్వం. బతుకమ్మ ఆటపాటలతో సాంస్కృతిక ఉద్యమాన్ని సమాంతరంగా నడిపి మహిళల సత్తాను చాటిన గొప్పతనం. దేశం నలుమూలలా అనేక వేదికలపై గళం విప్పి ఔరా అనిపించిన నైపుణ్యం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రసంగ పాఠవం.
ఏ అంశమైనా అలవోకగా అనర్గళంగా మాట్లాడే సత్తా కలిగిన విలక్షణ వ్యక్తిత్వం. బతుకమ్మ ఆటపాటలతో ఖండాంతరాలకు తెలంగాణ సంప్రదాయాన్ని వ్యాప్తి చేసి ఖ్యాతికెక్కిన సందర్భం. పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉండడమే నైజంగా పెట్టుకున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం.
నిరుపేదల ఆకలి తీరుస్తూ..
అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న అంటారు. ఎమ్మెల్సీ కవిత తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న నిజామాబాద్ జిల్లాలో ఖాళీ కడుపుతో మగ్గిపోతున్న వారెందరికో కడుపు నింపుతున్నా రు. ప్రభుత్వ దవాఖానల్లో నిత్యాన్నదాన కేంద్రాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ జాగృతి ద్వారా ప్రతి రోజూ 1500 మందికి ఆకలి బాధను తీరుస్తున్నారు. సుమారు మూడేండ్ల క్రితం మొదలైన ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతున్నది. కరోనా వంటి విపత్కర సమయంలోనూ వలస కార్మికులకు అండగా నిలబడ్డారు. నిరుపేదలకు భోజన సదుపాయం కల్పించారు. ప్రభుత్వ దవాఖానకు వైద్యం కోసం వచ్చే వారిలో ఎక్కువ మంది నిరుపేదలే కావడం, కొందరికి పూట గడవడమే కష్టం అన్నట్లుగా ఉంటుంది. దవాఖానకు వచ్చే వారంతా తమ వారిని కాపాడుకునే క్రమంలో ఆకలినే మర్చిపోవడం తప్ప… తినే సౌలభ్యం కరువు. ఇలాంటి వారికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కేంద్రాలు ఎంతో ఉపకరిస్తున్నాయి. నిజామాబాద్ దవాఖానలో 2017, నవంబర్ 10న అన్నదాన కేంద్రం ప్రారంభం కాగా ఇతర ప్రాంతాలకు విస్తరించారు. ప్రస్తుతం శాశ్వత ఏర్పాట్లతో కిచెన్ షెడ్డు అందుబాటులోకి రాగా వేలాది మందికి భోజనం సిద్ధం చేసే వెసులుబాటు కలిగింది.
ఉత్తమ పార్లమెంటేరియన్గా..
తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా లోక్సభ సభ్యురాలిగా కల్వకుంట్ల కవిత ఘనత సాధించారు. 2014 నుంచి 2019 వరకు నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహించారు. 2018 సంవత్సరానికి గాను ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎంపికయ్యారు. పార్లమెంట్లో వివిధ అంశాలపై తన వాయిస్ను వినిపించి దేశ వ్యాప్తంగా గుర్తింపు సాధించారు. ఇంగ్లిష్, హిందీ, తెలుగులో అనర్గళంగా మాట్లాడడం ఆమె ప్రత్యేకత. మహిళా సాధికారతపై విశేషంగా కృషి చేశారు. ఎంపీగా 15లక్షల మంది ప్రజలకు ప్రతినిధిగా నిలిచారు. పెద్ద బాధ్యతను నిర్వర్తించి నిజామాబాద్, జగిత్యాల జిల్లా ప్రజలకు ఎంతో మేలు చేకూర్చారు. పసుపు రైతుల చిరకాల కోరిక బోర్డు సమస్యపై ఢిల్లీ వేదికగా నినదించారు. మహిళా సాధికారతపై స్పందించారు. దేశ, విదేశాల్లో అంతర్జాతీయ వేదికలపై గళం వినిపించారు. బీడీ కార్మికులకు పింఛన్ వచ్చేలా కృషి చేశారు. హైకోర్టు సాధనలో లోక్సభలో ముందుడి పోరాటం చేశారు. దేశ చరిత్రలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఉమెన్ విభాగం ఆధ్వర్యంలోని ఎంపీల బృందాన్ని కవిత లీడ్ చేశారు. కామన్వెల్త్ ఉమెన్ పార్లమెంటేరియన్ గ్రూపులో సభ్యురాలిగా పని చేశారు. 2014 పార్లమెంట్ తొలి సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టానికి శుభాకాంక్షలు కూడా చెప్పకపోవడంతో అదే అంశాన్ని తన తొలి ప్రసంగంలో ప్రస్తావించారు కవిత. కశ్మీర్ పండిట్ల అంశంపై చేసిన ప్రసంగం యావత్ దేశం మెచ్చింది.
పసుపు బోర్డు కోసం అలుపెరగని పోరాటం…
నిజామాబాద్ జిల్లాలో పసుపు పంట రైతులకు తమ కష్టాల గురించి రెండు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో పసుపు బోర్డు ఏర్పా టు చేయాలని కోరుతున్నారు. వాళ్ల ప్రయత్నానికి అండగా పార్లమెంట్ సభ్యురాలిగా కల్వకుంట్ల కవిత అనేక రకాలుగా పోరాటం చేశారు. 2014 నుంచి 2019 వరకు పసుపు బోర్డు సాధనకు తీవ్రమైన కృషి చేశారు. పార్లమెంట్లో ఎన్నో సార్లు పసుపు రైతుల బాధలు వినిపించారు. ప్రధాని దృష్టికి సైతం తీసుకెళ్లారు. కవిత తీసుకువచ్చిన ఒత్తిడితో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ దిగి వచ్చి స్పెషల్ టర్మరిక్ సెల్ ఏర్పా టు చేస్తామంటూ ప్రత్యామ్నాయ మార్గాలను చూపించింది. పట్టువదలకుండా బీజేపీ ప్రభుత్వంపై కవిత… పార్లమెంట్ వేదికగా అలుపెరగని పోరాటం చేసి రైతుల పక్షపాతిగానూ నిలిచారు. కేంద్రం మాత్రం మొండి వైఖరిని వీడకుండా పసుపు రైతులను చిన్నచూపు చూస్తూనే ఉంది.