Who am I | అవును. ఇంతకీ నువ్వెవరు?.. ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోగలిగితే చాలు. జీవితం ధన్యమైనట్టే. ఆ స్పష్టత లేకపోతే మాత్రం.. బతుకు తెగిన గాలిపటమే, చిరునామా రాయకుండా పోస్టు డబ్బాలో వేసిన ఉత్తరమే. ‘నేనెవరన్నది నాకెవరు చెబుతారు?’ అనే కదా మీ ప్రశ్న. ఒక్క క్షణం కళ్లు మూసుకోండి. ఓ ఆగంతకుడు గొంతు మీద కత్తి పెట్టి ‘నువ్వెవరు?’ అని అడుగుతున్నట్టు ఊహించుకోండి. ఆ క్షణాన మీరిచ్చే జవాబే మీ జీవితం.
నాకు ఇష్టమైన వ్యాపకం ఏది?
నాకు ఏ పనిలో నైపుణ్యం ఉంది?
నేను ఏం చేస్తే ఆర్థికంగా స్థిరపడగలను?
ప్రపంచానికి నేనేం ఇవ్వగలను?
.. ఈ ప్రశ్నలన్నిటికీ మీరిచ్చే జవాబులన్నీ ఓ చోట పోగేస్తే మీరెవరన్నది మీకే స్పష్టంగా తెలిసిపోతుంది. మీకు ఆనందాన్నిచ్చే విషయాలు ఏమిటన్నది తేలిపోతుంది. ఏ వృత్తిని ఎంచుకుంటే మీరు ఉత్సాహంగా పనిచేస్తారన్నది తేటతెల్లం అవుతుంది. నచ్చిన వ్యాపకం కోసం మనల్ని మనం అంకితం చేసుకోవడం కూడా ఓ రకమైన తపస్సే. ప్రపంచంలోనే అత్యంత ఆనందంగా జీవించే మానవ సముదాయాలు ఉన్న ప్రాంతాలను నిపుణులు ‘బ్లూ జోన్స్’గా పిలుస్తారు. అక్కడి మనుషులు నిలువెత్తు ఆనంద స్వరూపులు. ఆ ఆనందం వెనుక ‘నేనెవరు?’ అనే ఎరుక ఉంది. నువ్వొక కవి, రచయిత, సైంటిస్ట్, టీచర్, పాకశాస్త్ర నిపుణుడు.. ఏమైనా కావచ్చు. ఆ జవాబు తెలిస్తే చాలు. అర్థంలేని వెంపర్లాటలు ఉండవు. కస్తూరి
మృగంలా ఎక్కడెక్కడో నిన్ను నువ్వు వెతుక్కునే ప్రయత్నాలు చేయవు. కవివే అయితే, ఉత్తమ కవిగా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తావు. సైంటిస్టువైతే ప్రపంచానికి పనికొచ్చే ఆవిష్కరణలు అందిస్తావు. మున్సిపల్ కార్మికుడివైతే.. నీకు కేటాయించిన వీధిని అద్దంలా శుభ్రం చేస్తావు. దీనివల్ల హఠాత్తుగా నీ సంపాదన పెరగవచ్చు, పెరగక పోనూవచ్చూ.
రాత్రికిరాత్రే గుర్తింపు రావచ్చూ, రాకపోనూవచ్చు. కానీ నీ జీవితంలో మాత్రం అనూహ్యమైన మార్పు మొదలవుతుంది. ప్రతిరోజూ కొత్తగా అనిపిస్తుంది. ఇష్టమైన పనిలో ఒత్తిడి ఉండదు. మనసు మొరాయించే ప్రసక్తే లేదు. ఒత్తిడిలేని ఆఫీసు స్వర్గం లాంటిదే. ఒత్తిడిలేని ఉద్యోగం ప్రధానమంత్రి పదవి కంటే గొప్పది. ఒత్తిడి మహమ్మారి మనసును కుళ్లబొడుస్తుంది, శరీరాన్ని రోగాలపాలు చేస్తుంది. ఆనందాన్ని మింగేస్తుంది. ఆయువును లాగేసుకుంటుంది. కాబట్టే, ఇష్టంగా పనిచేసిన వ్యక్తులు.. ఒంటిచేత్తో కొండల్ని తవ్వి రహదారులు నిర్మించిన కథలు చదివాం. ఒంటికాలితోనే ఎవరెస్టు అధిరోహించిన వార్తలు చూశాం. అంతిమంగా లభించే సంతృప్తే వాళ్లను ఆ కార్యాలకు ఉసిగొల్పింది. ఆ ఆనందం వెంటే సంపదలు, పురస్కారాలు.. ఒకదాని తర్వాత ఒకటి వచ్చి చేరుతాయి. అదే కేవలం డబ్బు కోసం మొదలైన అన్వేషణ అన్నిసార్లూ సంపదను ఇవ్వకపోవచ్చు. చేదు అనుభవాలను మిగల్చవచ్చు.
యాభైఏండ్ల క్రితం కర్ణాటకలోని ఉడుపిలో ఓ వంటవాడు ఉండేవాడు. తన వృత్తిని ప్రాణంగా ప్రేమించేవాడు. తన చేతి సాంబారు ఘుమఘుమలు ఊరంతా వ్యాపించేవి. కొద్దికాలానికి బెంగళూరుకు వలస వచ్చాడు. ఫుట్పాత్ మీద ఇడ్లీబండి పెట్టాడు. అక్కడ దొరికే వేడివేడి సాంబార్-ఇడ్లీ కోసం జనం ఎగబడేవారు. ‘మాకూ ఆ సాంబారు పొడి కావాలి?’ అని అడగటం మొదలుపెట్టారు. దీంతో అతను సాంబారు పొడి వ్యాపారంలోకి వచ్చాడు. ఆ తర్వాత రసం పొడి, కూర మసాలా, బిసిబేళాబాత్ పొడి.. ఒక్కొక్కటీ పరిచయం చేశాడు. ఒకనాటి ‘మావళ్లి టిఫిన్ రూమ్’ దశాబ్ద కాలంలోనే ఎంటీఆర్ బ్రాండ్గా విస్తరించింది. తనెవరో తెలుసుకోవడం వల్లే ఆ పాకశాస్త్ర నిపుణుడు ఇంతటి విజయాన్ని సాధించాడు.
మనం మళ్లీ మళ్లీ చేసేపనులే.. మనం. ఆ పనుల్ని ఎంత శ్రద్ధగా, ఎంత ప్రేమగా, ఎంత నైపుణ్యంగా చేస్తే అంత గొప్ప మనం అవుతాం. ఆ పనిని ధ్యాన స్థితిలో చేయాలి. ఓ ఒలింపిక్ విజేతను ‘మీరు రోజూ ఎన్ని గంటలు సాధన చేసేవారు?’ అని అడిగారట పాత్రికేయులు. ‘రెండు గంటలు ధ్యానం చేసేవాడిని, ఓ గంట ప్రాక్టిస్ చేసేవాడిని’ అని చెప్పాడు ఆ ఆటగాడు. ధ్యానం అంటే ఫోకస్. ఆ గురి పెరిగేకొద్దీ లక్ష్యం దగ్గర అవుతుంది. లక్ష్యం పట్ల స్పష్టత ఉంటేనే ఎక్కడ గురి పెట్టాలన్నది తెలుస్తుంది. ‘నేనెవరు?’ అన్న ప్రశ్నకు జవాబు తెలిసినప్పుడే ఇదంతా సాధ్యం అవుతుంది. కాబట్టి, నిన్ను నువ్వు తెలుసుకోనంతకాలం.. నీ చదువు వృథా, నీ తెలివితేటలు వృథా వృథా.