ముంబై: ఆటపట్టిస్తోందన్న ఆగ్రహంతో పొరుగింటి బాలికను ఒక యువకుడు హత్య చేశాడు. (Teen Kills Girl For Teasing) మృతదేహాన్ని రెండు రోజులపాటు ఇంట్లో దాచాడు. ఆ తర్వాత జరిగిన సంగతి తండ్రికి చెప్పాడు. వారిద్దరూ కలిసి బాలిక మృతదేహాన్ని ఒక ఖాళీ ఇంట్లో దాచారు. బాలిక మిస్సింగ్పై దర్యాప్తు చేసిన పోలీసులు ఆ యువకుడితోపాటు అతడి తంట్రిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పెల్హార్ గ్రామంలోని పురాతన భవనంలో నివసించే 16 ఏళ్ల యువకుడిని పొరుగింటికి చెందిన 8 ఏళ్ల బాలిక ఎప్పుడూ ఆటపట్టించేంది. దీంతో విసిగిపోయిన అతడు ఆమెను ఏదైనా చేయాలని భావించాడు. డిసెంబర్ 1న రాత్రి వేళ ఐస్క్రీమ్ కొనేందుకు ఆ బాలిక ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన ఆ యువకుడు ఆమెను తన ఇంట్లోకి లాక్కెళ్లాడు. గొంతు నులిమి హత్య చేశాడు. బాలిక మృతదేహాన్ని రెండు రోజులపాటు ఇంట్లో దాచాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని తండ్రికి చెప్పాడు. దీంతో వారిద్దరూ కలిసి బాలిక మృతదేహాన్ని ఖాళీగా ఉన్న మరో ఇంట్లో వదిలేశారు.
కాగా, బాలిక అదృశ్యం గురించి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆమె కోసం వెతికినా ఫలితం లేకపోయింది. డిసెంబర్ 4న పాత భవనంలోని ఒక ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ప్లాస్టిక్ బ్యాగ్లో కుక్కిన బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గొంతు నులిమి ఆమెను హత్య చేసినట్లు పోస్ట్మార్టం రిపోర్ట్లో తెలుసుకున్నారు.
మరోవైపు బాలిక మృతదేహం బయటపడిన రోజు నుంచి పొరుగింటి యువకుడు కనిపించకపోవడం పోలీసుల దృష్టికి వెళ్లింది. అతడి ఇంటి వద్ద ఆ బాలిక చెప్పులు ఉండటంతో మరింత అనుమానించారు. జలాన్ జిల్లాలో ఉన్న ఆ యువకుడ్ని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని ప్రశ్నించగా తనను ఆటపట్టిస్తుందన్న కోపంతో బాలికను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని ఖాళీ గదిలోకి తరలించేందుకు తండ్రి సహాయం చేసినట్లు చెప్పాడు. దీంతో పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.