కోల్కతా: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల (special Parliament session) పూర్తి ఎజెండాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదని టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ విమర్శించారు. కుయుక్తులు పన్ని చివర్లో డర్టీ నిర్ణయాలు తీసుకునే ఉద్దేశంలో మోదీ ప్రభుత్వం ఉన్నదని ఆయన ఆరోపించారు. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దేని కోసం ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారో అన్నది స్పష్టం చేయలేదు. ఇండియా పేరును భారత్గా మార్పు చేయడం, ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ కోసం బిల్లు తీసుకువచ్చేందుకే అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కాగా, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల గురించి కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లు, ఇతర కీలక బిల్లుల గురించి ప్రస్తావించింది. అలాగే ఈ ప్రత్యేక సెషన్లో 75 ఏండ్ల పార్లమెంటరీ ప్రయాణంపై చర్చ జరుగుతుందని పేర్కొంది.
అయితే పార్లమెంట్ స్పెషల్ సెషన్ గురించి కేంద్రం పూర్తిగా వెల్లడించలేదని టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ విమర్శించారు. ‘వారు (కేంద్రం) డర్టీ ట్రిక్స్కు పాల్పడతారు. చివరి నిమిషంలో కొత్త అంశాలు జోడిస్తారు’ అని ఆరోపించారు.