Somnath | అంతరిక్ష రంగ అభివృద్ధికి అనవసరమైన ఆంక్షలు, నియంత్రణలను వదిలించుకోవాల్సిన అవసరం ఉందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమ్నాథ్ అన్నారు. అయితే, అంతరిక్ష రంగం వేగవంతమైన వృద్ధికి నియంత్రణ చాలా ముఖ్యమైందన్నారు. భారతదేశ తొలి సౌండింగ్ రాకెట్ ప్రయోగం 60వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ అంతరిక్ష విజ్ఞాన ప్రపంచంలో దేశం గణనీయమైన ప్రగతిని సాధించిందని అన్నారు. ప్రైవేటు రంగం సహకారంతో భారత్ ఉపగ్రహాల తయారీ సామర్థ్యం గణనీయంగా మెరుగుపడిందన్నారు.
భారత్లో ఉపగ్రహాల అభివృద్ధి, ఉత్పత్తి, లాంచింగ్ వెహికల్స్, సంబంధిత సాంకేతిక పరిజ్ఞానానికి ఇస్రో మాత్రమే బాధ్యత వహిస్తుందని సోమనాథ్ పేర్కొన్నారు. భారత్లో 130 కంటే ఎక్కువ స్టార్టప్లు అంతరిక్ష రంగంలో పని చేస్తుండగా.. కొన్ని కంపెనీల్లో 400-500 మంది ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. ఆయా కంపెనీల టర్నోవర్ రూ.500 నుంచి రూ.1000కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. ఇస్రో కంటే కొన్ని కంపెనీలు మెరుగైన వేతనాలు అందిస్తున్నాయన్నారు. వాటిలో రిటైర్డ్ ఇస్రో శాస్త్రవేత్తలు సైతం సేవలు అందిస్తున్నారన్నారు.
ఉపగ్రహాల తయారీకి భారత్ అత్యత్తుమ కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐదు భారతీయ కంపెనీలు ఉపగ్రహాలను తయారు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయన్న ఆయన.. ఇందులో మూడు కంపెనీలు విదేశాల నుంచి ఉపగ్రహాలను సైతం విజయవంతంగా నిర్మించి ప్రయోగించాయన్నారు. ఉపగ్రహాలను భారత్లోనే తయారు చేయాలనుకుంటున్నామని.. టెక్నాలజీని ఎక్కడి నుంచైనా తీసుకురావచ్చన్నారు. స్పేస్ సైన్స్లో ప్రైవేట్ రంగాన్ని విస్తరించడం అంటే ఇస్రో పాత్రను తగ్గించడం కాదని సోమ్నాథ్ స్పష్టం చేశారు.
ఇస్రో పరిధి విస్తరిస్తోందన్నారు. జీఎస్ఎల్వీ రాకెట్ను ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. ఇది మొదట 4 టన్నుల పేలోడ్ను మోసుకెళ్లేలా రూపొందించామని.. అయితే ఇప్పటికే 7.5 టన్నుల పేలోడ్ను విజయవంతంగా ప్రయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. క్రయోజెనిక్ స్టేజ్ను సైతం అప్గ్రేడ్ అవుతోందన్నారు. పీఎస్ఎల్వీ అప్గ్రేట్ చేస్తున్నామన్నారు. ప్రారంభంలో 850 కిలోలు ఉండగా.. సామర్థ్యం రెండు టన్నులకు పెంచనున్నట్లు వివరించారు.