లక్నో: కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపడంతోపాటు ప్రజల జీవన విధానాన్ని కూడా ప్రభావితం చేస్తున్నది. పూలు అమ్మేచోట కట్టెలు అమ్మిన సామెత మాదిరిగా కొన్ని వ్యాపారాల పరిస్థితి మారింది. కరోనా నేపథ్యంలో పెండ్లి వేడుకలకు ప్రజలంతా దూరంగా ఉన్నారు. మరోవైపు కరోనాతో మరణిస్తున్నవారి సంఖ్య ఆందోళన రేపుతున్నది. క్యూకడుతున్న కరోనా మృతదేహాల అంత్యక్రియలకు శ్మశానవాటికల్లో చోటు చాలడం లేదు. దీంతో పలు చోట్ల రోడ్ల మీదనే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్లో ఒకప్పుడు పెండ్లి వస్తువులన్నీ ఒక చోట అమ్మే షాపులు ఇప్పుడు అంత్యక్రియల సామగ్రి అమ్మే దుకాణాలుగా మారాయి. తమ కుటుంబం ఎన్నో ఏండ్లగా వివాహాలకు కావాల్సిన వస్తువుల వ్యాపారం చేసేదని ప్రయోగరాజ్లోని చౌక్ ప్రాంతానికి చెందిన అంకిత్ అగర్వాల్ తెలిపారు. కరోనా కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య పెరుగడంతో ప్రస్తుతం దహన సంస్కారాల కోసం కావాల్సిన వాటిని అమ్ముతున్నట్లు చెప్పారు. స్థానికులు కూడా ఆ షాపుల గురించి ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు.