New Delhi | నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారసత్వాన్ని రాజకీయం కోసం దుర్వినియోగం చేస్తున్నారని నేతాజీ కుమార్తె తీవ్రంగా ఆక్షేపించారు. గణతంత్ర దినోత్సవాల సందర్భంగా నేతాజీ, హిందూఫౌజ్తో ఉన్న శకటానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించిన నేపథ్యంలో నేతాజీ కుమార్తె అనితా బోస్ పై విధంగా ఆక్షేపించారు. నేతాజీ, హిందూఫౌజ్తో ఉన్న శకటాన్ని ప్రభుత్వం ఎందుకు నిరాకరించిందో ఇప్పటికీ తనకు అర్థమే కావడం లేదన్నారు. అయితే దీని వెనక ఏవో బలమైన కారణాలు ఉండే ఉండాలని అభిప్రాయపడ్డారు. వచ్చే సంవత్సరం 125 సంవత్సరాల జయంతి జరుపుకుంటామని, ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం ఎందుకు నిరాకరించిందో అర్థం కావడం లేదని, విడ్డూరంగా ఉందని ఆమె పేర్కొన్నారు. గత సంవత్సరం బెంగాల్ వేదికగా జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారని, ఆ జయంత్యుత్సవాలకు, ఎన్నికలకు ఏదో సంబంధముందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్, హిందూఫౌజ్తో ఉన్న శకటాన్ని అధికారులు తిరస్కరించిన నేపథ్యంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. అధికారుల వైనాన్ని చూస్తుంటే తాను తీవ్ర షాక్కు లోనయ్యానని పేర్కొన్నారు. అసలు ఏ విషయం ప్రాతిపదికన అధికారులు ఈ శకటాన్ని శకటాల జాబితాలో చేర్చలేదో అర్థం కావడం లేదన్నారు.