నాసిక్, జూలై 25 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని నాసిక్ నగరం లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరోగ్య కేంద్రంలో టీటీ (టెటానస్ డిప్తీరియా) వ్యాక్సిన్ వేయించుకున్న శ్రావణి పాటిల్ (17) కొద్ది నిమిషాల్లోనే మరణించింది. వివరాల్లోకి వెళితే.. నాసిక్లోని ఖుట్వడ్ నగర్ ప్రాంతానికి చెందిన శ్రావణి పాటిల్, గురువారం మధ్యాహ్నం తన తండ్రితో కలిసి స్థానిక మున్సిపల్ ఆరోగ్య కేంద్రానికి టీటీ వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్లింది.
టీకా వేయించుకున్న తర్వాత తండ్రితో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా, మార్గమధ్యంలో స్పృహ తప్పి పడిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సమీపంలోని దవాఖానకు తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ఆరోగ్యశాఖ స్పందిస్తూ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. ముందస్తు జాగ్రత్తగా నాసిక్ నగరంలో ప్రస్తుతం ఆ బ్యాచ్కు చెందిన టీకా వాడకాన్ని నిలిపివేశారు.