లక్నో : ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అమలువుతున్న లాక్డౌన్ తరహా కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. గురువారం ఉదయంతో కర్ఫ్యూ ముగియనుండగా మే 10 వరకు పొడిగిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో రాష్ట్రంలోని అన్నిదుకాణాలు, వ్యాపార సముదాయాలు వచ్చే సోమవారం ఉదయం 7 గంటల వరకు మూతపడున్నాయి.
రాష్ట్రంలో కరోనా పరిస్థితిని యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఆరోగ్యశాఖ మంత్రి జైప్రతాప్ సింగ్తోపాటు ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
అధికారుల సూచన మేరకు సీఎం కర్ఫ్యూ పొడిగింపునకు పచ్చజెండా ఊపారు. రాష్ట్రంలో కరోనా కర్ఫ్యూ పొడిగించడం వరుసగా ఇది మూడోసారి. కర్ఫ్యూ సమయంలో అత్యసవర సేవలకు మినహాయింపునిచ్చారు.
వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా కట్టడికి రాష్ట్రంలోని 75 జిల్లాల్లో శానిటైజేషన్ డ్రైవ్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గడిచిన కొన్నివారాలుగా మూపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే యాక్టివ్ కేసులు 3 లక్షలు దాటాయి. దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం కావడంతో కరోనా కట్టడి ప్రభుత్వానికి సవాల్గా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.